ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఇరు జట్లు తప్పక విజయం సాధించాల్సిందే. ఈ సీజన్లో పది మ్యాచ్లు ఆడిన సీఎస్కే అయిదింట్లో గెలిచి 10 పాయింట్లతో అయిదో స్థానంలో నిలిచింది. పంజాబ్ జట్టు ఎనిమిది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
పాయింట్ల పట్టికలో సీఎస్కే మెరుగైన స్థానంలో ఉన్నా రికార్డుల పరంగా పంజాబ్దే పైచేయి. గత అయిదు మ్యాచ్ల్లో సీఎస్కేను పంజాబ్ చిత్తుగా ఓడించింది. ఈ సీజన్లో చెన్నై జట్టు సొంతమైదానంలో జరిగిన మ్యాచ్లోనూ పంజాబ్ కింగ్స్దే విజయం. దీంతో ఇవాళ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్నారంతా.

కాగా, టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ మాట్లాడాడు. గత మ్యాచ్లో ఆడిన తుది జట్టునే కొనసాగిస్తున్నామని చెప్పాడు. అదే జట్టుతో గత రెండు మ్యాచ్ల్లో విజయం సాధించామని పేర్కొన్నాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ.. గాయాలు, వివిధ కారణాలతో జట్టులో మార్పులు చేయాల్సి వచ్చిందని వివరించాడు.
తమ జట్టుపై పంజాబ్ కింగ్స్కు ఉన్న రికార్డును పట్టించుకోవట్లేదని, తమ ఆటపైనే దృష్టిసారిస్తున్నామని రుతురాజ్ తెలిపాడు. ఈ సీజన్లో పది మ్యాచ్ల్లో టాస్ ఓడామని, అందులో అయిదు మ్యాచ్లు గెలవడం సానుకులాంశమని అన్నాడు. బంగ్లాదేశ్ తరఫున ఆడటానికి వెళ్లిన ముస్తాఫిజుర్ స్థానంలో మిచెల్ శాంట్నర్ తీసుకున్నామని పేర్కొన్నాడు.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: బెయిర్స్టో, రొసో, సామ్ కరన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్.
చెన్నై సూపర్ కింగ్స్: అజింక్య రహానె, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, శివమ్ దూబె, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్పాండే.