రవీంద్ర జడేజా (46; 26 బంతుల్లో, 3x4, 2x6) సత్తాచాటడంతో పంజాబ్ కింగ్స్కు సీఎస్కే 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24) చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.
చెన్నై సూపర్ కింగ్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. అజింక్య రహానె (9; 7 బంతుల్లో, 1x4) పేలవ ఫామ్ను కొనసాగించాడు. అర్షదీప్ సింగ్ బౌలింగ్లో షాట్కు యత్నించి రబాడ చేతికి చిక్కాడు. అయితే వన్డౌన్లో వచ్చిన డారిల్ మిచెల్ (30; 19 బంతుల్లో, 2x4, 1x6)తో కలిసి రతురాజ్ గైక్వాడ్ (32; 21 బంతుల్లో, 4x4, 1x6) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ పవర్ప్లేలో జట్టు స్కోరును 60/1 చేర్చారు.

అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రాహుల్ చాహర్ విడదీశాడు. రుతురాజ్ గైక్వాడ్ను ఔట్ చేసి 57 పరుగుల (37 బంతుల్లో) భాగస్వామ్యానికి తెరదించాడు. తర్వాతి బంతికే శివమ్ దూబెను డకౌట్ చేసి సీఎస్కేను రాహుల్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. దూబెకు ఇది వరుసగా రెండో గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. పంజాబ్తో జరిగిన గత మ్యాచ్లోనూ దూబె తొలి బంతికి డకౌటయ్యాడు.
కాసేపటికే కుదురుకున్న డారిల్ మిచెల్ను హర్షల్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 69/1తో మెరుగైన స్థితిలో ఉన్న చెన్నై 75/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన మొయిన్ అలీ (17; 20 బంతుల్లో, 2x4), రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కానీ పంజాబ్ బౌలర్ల ధాటికి సీఎస్కే బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
అయితే శార్దూల్ ఠాకూర్ (17; 11 బంతుల్లో, 2x4, 1x6)తో కలిసి జడేజా దూకుడుగా ఆడటంతో చెన్నై పంజాబ్ ముందు పోరాడే స్కోరు ఉంచింది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోనీని హర్షల్ పటేల్ మొదటి బంతికే క్లీన్బౌల్డ్ చేశాడు. రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు తీశారు. అర్షదీప్ రెండు వికెట్లు పడగొట్టాడు.