ప్రియాంశ్ ఆర్య.. ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. ఐపీఎల్ అభిమానులు అంత ఈజీగా ఇతడిని మరిచిపోలేరేమో. ఇప్పటివరకు కెరీర్ లో కేవలం నాలుగు మ్యాచులు ఆడిన అతడు.. విధ్వంసం సృష్టిస్తున్నాడు. మొదటగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తన తొలి మ్యాచ్లోనే 22 బంతుల్లో 47 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆ డిన అతడు... తన తర్వాతి రెండు మ్యాచ్ల్లో 8, 0 పరుగులతో కాస్త నిరాశపరిచాడు. కానీ మళ్లీ తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచులో వీరంగం సృష్టించాడు ఈ దిల్లీ కుర్రాడు. 42 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సుల సాయంతో 245.24 స్ట్రైక్ రేటుతో 103 పరుగులు చేశాడు.
అతడే ప్రధాన కారణం..
ఈ మ్యాచులో మొదట టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్... రెండో ఓవర్లోనే ప్రభ్సిమ్రన్ (0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శ్రేయస్ (9), స్టాయినిస్ (4), నెహాల్ వధేరా (9), మ్యాక్స్వెల్ (1) అందరూ వరుసగా పెవిలియన్ చేరారు. అయినా కూడా పంజాబ్ జట్టు 219 పరుగులు చేయడానికి ప్రధాన కారణం.. ప్రియాంశ్ ఆర్య బ్యాటింగే. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. అతడు మాత్రం అదిరే ప్రదర్శన చేశాడు. పవర్ ప్లేలో, కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 39 బంతుల్లోనే శతకం కూడా బాదేసి ఔరా అనిపించాడు. చివరికి నూర్ అహ్మద్ బౌలింగ్ లో విజయ్ శంకర్ చేతికి చిక్కి ఔటయ్యాడు.

శ్రేయస్ అయ్యర్ అలా చెప్పాడు..
మ్యాచ్ అనంతరం తన ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. "ఇది అద్భుతమైన అనుభూతి. నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా, జట్టుకు ఇంకా ఎక్కువగా సహకారం ఇవ్వాలని అనిపిస్తోంది. నేను గత మ్యాచ్లో ఔట్ అయిన తర్వాత, ఈసారి తొలి బంతి నుండే ఆత్మవిశ్వాసంతో, దూకుడుగా ఆడమని శ్రేయస్ నాతో చెప్పాడు. నేహాల్ బ్యాటింగ్కు దిగాక, మనం సింగిల్స్, డబుల్స్ కోసం ఆడుదాం అని నేనంటే, అతడు నాతో.. నీకు మొదటగా మనస్సులో ఏది వస్తే, అలానే ఆడు అని చెప్పాడు. అందరూ బౌలర్లు మంచిగా రాణిస్తున్నారు. అందరూ నన్ను ఇబ్బంది పెట్టగలిగేవాళ్లే." అని ప్రియాంశ్ ఆర్య చెప్పుకొచ్చాడు.