సీఎస్కే గెలిచిందా.. లేదా? అన్నది తర్వాత సంగతి.. ధోనీ క్రీజులోకి దిగాడా.. లేదా? బ్యాట్ ఝళిపించి మెరుపులు మెరిపించాడా.. లేదా? ఇదే అతడి నుంచి అభిమానులు ముందుగా ఆశిస్తారు. అసలు అతడి కోసమే మ్యాచ్ చూసేందుకే అభిమానులు స్టేడియానికి భారీ స్థాయిలో వస్తుంటారు. అదే మహీ ఏమాత్రం.. బ్యాటింగ్లో కాస్త తడబడ్డాడా.. ఆడలేదా లేదా ఔటైన కూడా ఫ్యాన్స్ బోరున ఏడుస్తారు. తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో ఇదే జరిగింది. ఓ లేడీ ఫ్యాన్ ధోనీ దెబ్బకు విలవిలలాడేలా ఏడ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆశలు రేపినా..
ఈ మ్యాచులో ఐదో స్థానంలో వచ్చాడు ధోనీ. కానీ ఆశించినంత స్థాయిలో వేగంగా ఆడలేకపోయాడు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించాడు. 12 బంతుల్లో 225 స్ట్రైక్ రేటుతో 1 ఫోర్, 3 సిక్సుల సాయంతో 27 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే కొన్ని షాట్లు ఆడి కాస్త ఆశలు రేపినా కూడా.. చివరి ఓవర్లో మహీ ఔటైపోయాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్ లో చాహల్ చేతికి చిక్కి ఔటైపోయాడు. అయితే 43 ఏళ్ల వయసులోనూ మహీ బానే ఆడుతున్నాడంటూ ఓ వైపు ప్రశంసలు వస్తున్నా... అతడు ఔటైనప్పుడు ఓ మహిళా అభిమాని మాత్రం భోరున విలపించింది. వెక్కివెక్కి ఏడ్చింది. ఆమె మాత్రమే కాదు ఇతర సీఎస్కే అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ చెందారు. అందరి ముఖాలు వెలవెలబోయాయి. ప్రస్తుతం నిరాశ చెందిన సీఎస్కే అభిమానుల హావాభావాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

వరుసగా నాలుగోది..
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో కాన్వే (69), దూబే (42), రచిన్ (36) పరుగులతో రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ లో ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో చెలరేగి ఆడడంతో ఆ జట్టు గెలిచింది. కాగా, ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి.