పంజాబ్ కింగ్స్ చేతిలో వరుస పరాజయాలకు చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బ్రేక్లు వేసింది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్పై 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తమపై పంజాబ్ సాధించిన వరుస అయిదు విజయాలకు ముగింపు లభించింది. అంతేగాక ఈ గెలుపుతో సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగు పర్చుకుంది. అయిదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (46; 26 బంతుల్లో, 3x4, 2x6) టాప్ స్కోరర్. రుతురాజ్ గైక్వాడ్ (32; 21 బంతుల్లో, 4x4, 1x6), డారిల్ మిచెల్ (30; 19 బంతుల్లో, 2x4, 1x6) కీలక పరుగులు సాధించారు. శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్కు చేరారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24) చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.

62/2తో పంజాబ్ కాస్త కోలుకుంటున్నట్లుగా కనిపించింది. కానీ సీఎస్కే బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. అలా వచ్చి ఇలా పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో 78 పరుగులకు పంజాబ్ కింగ్స్ ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సీఎస్కే విజయానికి ఎక్కువసేపు సమయం పట్టదనిపించింది.

కానీ పంజాబ్ టెయిలెండర్లు పోరాడారు. ఓటమి అంతరాన్ని తగ్గించారు. హర్ప్రీత్ బ్రార్ (17; 13 బంతుల్లో, 2x4), రబాడ (11; 10 బంతుల్లో) అజేయంగా నిలిచి పంజాబ్ను ఆలౌట్ కాకుండా కాపాడారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా (3/20) మూడు, సిమర్జీత్ సింగ్ (2/16), తుషార్ దేశ్పాండే (2/35) చెరో రెండు వికెట్లు తీశారు.