హైదరాబాద్: తాజాగా మరో విదేశీ క్రికెటర్ మన స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్లను తెగ పొగిడేస్తున్నాడు. దక్షిణాఫ్రికా జట్టు మాజీ బౌలర్ పాల్ ఆడమ్స్ సఫారీ జట్టు విజయాన్ని తారుమారు చేసింది వీళ్లేనంటూ అభిప్రాయపడ్డాడు. వన్డే జట్టులో ఒక మణికట్టు స్పిన్నర్ను ఆడించడమే గగనమవుతున్న రోజుల్లో ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగుతోందంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.
అదే భారత్ను మిగతా జట్ల కంటే భిన్నంగా నిలబెడుతోందని దక్షిణాఫ్రికా మాజీ చైనామన్ బౌలర్ పాల్ ఆడమ్స్ అన్నాడు. ''ప్రస్తుతం క్రికెట్ అంతా బ్యాట్స్మెన్ చుట్టూ తిరుగుతోంది. ఇలాంటి స్థితిలో ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవడం చాలా గొప్ప విషయం. పైగా ఇద్దరూ మణికట్టు స్పిన్నర్లే. ఇద్దరూ విభిన్నమైన కోణాల్లో.. విభిన్నమైన బంతులు వేస్తున్నారు' అని తెలిపాడు.
ఇంకా మాట్లాడుతూ.. 'బంతిని.. బ్యాట్స్మన్కు దూరంగా తీసుకుపోతున్నారు. అందుకే భారత్ వీరిని ఆడించడానికే మొగ్గు చూపుతోంది. జట్టు కూర్పు కూడా అందుకు అనుమతిస్తోంది. చాలా జట్లు ఇలా చేయలేవు. వన్డే జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటివ్వవు. దక్షిణాఫ్రికా వన్డే, టీ20ల్లో ఎప్పుడూ ఇలా చేయలేదు. జొహానెస్బర్గ్ వన్డేలో దక్షిణాఫ్రికా కనీసం ఒక్క స్పిన్నర్ను కూడా దింపకపోగా... భారత్ మాత్రం కుల్దీప్, చాహల్ను ఆడించింది. ఇదే రెండు జట్లకు తేడా'' అని చెప్పాడు.
ఇండియా చాలా గట్టి నిర్ణయమే తీసుకుంది. ఇద్దరు స్పిన్నర్లను తీసుకుని జట్టు సమన్వయం చూసుకోవాలంటే కాస్త కష్టంతో కూడుకున్న పనే. దక్షిణాఫ్రికా సాధారణంగా ఇద్దరు స్పిన్నర్లను ఎప్పుడూ తీసుకోదు. ఏ ఒక్కరితో అయినా మ్యాచ్ ను నడిపిస్తోంది. కానీ జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో ఒక్క స్పిన్నర్ కూడా సఫారీ జట్టులో ఆడలేదని తెలిపాడు.