కొలంబో: శ్రీలంకలో పర్యటిస్తోన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మరో పరాభవం. మూడో వన్డేలో భారీ స్కోర్ చేసినప్పటికీ.. ఓటమి కోరల నుంచి తప్పించుకోలేకపోయింది. శ్రీలంక బ్యాటర్లను నిలువరించలేకపోయింది. సొంతగడ్డపై చెలరేగిపోయారు లంకేయులు. భారీ పరుగుల టార్గెట్ను కొట్టి అవతల పడేశారు. అయిదు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్లో వరుసగా రెండో విజయాన్ని సాధించారు. 2-1 తేడాతో ఆధిక్యతలో నిలిచారు.
కొలంబో ప్రేమదాస స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 291 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఫస్ట్ డౌన్ బ్యాటర్ మిఛెల్ మార్ష్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. మిగిలిన బ్యాటర్లు భారీ స్కోర్లు సాధించారు. కేప్టెన్ ఆరోన్ ఫించ్ 85 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అలెక్స్ క్యారీ-49, ట్రవిస్ హెడ్-70, మార్నుస్ లాంబుషెన్-29 పరుగులు చేశారు. డెత్ ఓవర్లల్లో గ్లెన్ మ్యాక్స్వెల్ దుమ్ము దులిపాడు. 18 బంతుల్లో 33 రన్స్ బాదడంతో స్కోర్ 291 పరుగులకు వెళ్లింది.
శ్రీలంక బౌలర్లల్లో జెఫ్రీ వాండెర్సె మూడు వికెట్లు పడగొట్టాడు. దుష్మంత చమీర, దునిత్ వెల్లలగె, ధనంజయ డిసిల్వా ఒక్కో వికెట్ తీసుకున్నారు. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయుల ఇన్నింగ్ మొదట్లో మందకొడిగా సాగినప్పటికీ.. ఆ తరువాత జోరందుకుంది. జట్టు స్కోర్ 42 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ నిరోషన్ డిక్వెల్ల అవుట్ అయ్యాడు. ఆ తరువాత మరో వికెట్ పడగొట్టడానికి ఆసీస్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి.
మరో ఓపెనర్ పాథుమ్ నిశ్శంక, వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ విరుచుకుపడ్డారు. భారీ షాట్లతో చెలరేగారు. ఈ క్రమంలో నిశ్శంక సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 147 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. జట్టు స్కోరు 212 పరుగుల వద్ద ఉన్నప్పుడు కుశాల్ మెండిస్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. 85 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 87 పరుగులు చేశాడు మెండిస్.
255 పరుగుల వద్ద ధనంజయ డిసిల్వా అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో నాలుగు ఫోర్లతో 25 పరుగులు చేశాడు. 284 పరుగుల వద్ద పాథుమ్ నిశ్శంక, 285 పరుగుల వద్ద డాసన్ శనక అవుట్ అయినప్పటికీ.. అప్పటికే శ్రీలంక విజయం ఖాయమైంది. 48.3 ఓవర్లల్లోనే 292 పరుగులు చేసింది. జైరె రిచర్డ్సన్ రెండు, జోష్ హేజిల్వుడ్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయిదు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్లో శ్రీలంక 2-1 ఆధిక్యతతో నిలిచింది.