ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ధర్మశాల వేదికగా రేపు పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే సీఎస్కే తప్పక విజయం సాధించాల్సిందే. ఈ సీజన్లో పది మ్యాచ్లు ఆడిన చెన్నై అయిదింట్లో గెలిచి 10 పాయింట్లతో అయిదో స్థానంలో నిలిచింది.
అయితే తుదిజట్టు కూర్పు చెన్నైకు తలనొప్పి తెచ్చి పెడుతోంది. కీలక ఆటగాళ్లు వివిధ కారణాలతో జట్టుకు దూరమవ్వడం ప్రధాన సమస్యగా మారింది.గాయం కారణంగా దీపక్ చాహర్, అనారోగ్యంతో తుషార్ దేశ్పాండే, తమ దేశానికి ప్రాతినిథ్యం వహించడం కోసం బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ జట్టుకు దూరమయ్యారు. అయితే వీసా ప్రక్రియను త్వరగా పూర్తిచేసుకుని పతిరణా, తీక్షణ తిరిగిరావడం సీఎస్కేకు కాస్త ఉపశమనంగా మారింది. ఈ ఇద్దరు తిరిగొచ్చినప్పటికీ కొన్ని సమస్యలు జట్టును వేధిస్తున్నాయి.

ఓపెనర్ అజింక్య రహానె పేలవ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. రహానె వైఫల్యంతో పవర్ప్లేలో చెన్నై అదిరే ఆరంభాన్ని అందుకోలేకపోతుంది. అంతేగాక దూబెపై ఎక్కువగా ఆధారపడటం జట్టుకు ప్రతికూలాంశంగా మారింది. డారిల్ మిచెల్ ఆశించిన రీతిలో పరుగులు చేయలేకపోవడం, జడేజా హిట్టింగ్ చేయలేకపోవడంతో సీఎస్కే బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. అయితే రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఫామ్ అందుకోవడం సంతోషకరమైన విషయం.
మరోవైపు పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ అంటే సీఎస్కే ఆత్మరక్షణలోకి వెళ్తోంది. ఇప్పటివరకు ఇరుజట్లు 29 మ్యాచ్లు ఆడాయి. పంజాబ్ 14, చెన్నై 15 విజయాలు సాధించాయి. కానీ గత అయిదు మ్యాచ్ల్లో పంజాబ్దే ఆధిపత్యం. ఈ సీజన్లో సొంతమైదానంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లోనూ సీఎస్కే ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు (అంచనా): అజింక్య రహానె, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, పతిరణా, తీక్షణ, ముఖేష్ చౌదరి
ఇంపాక్ట్ ప్లేయర్: మొయిన్ అలీ