
సిడ్నీ: ఈ ఏడాది చివరలో జరుగనున్న టెస్టు సిరీస్లో టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారను త్వరగా ఔట్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తామని ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. 2018-19 సీజన్లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు టెస్టు సిరీస్ను 2-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై భారత్కు తొలి టెస్టు సిరీస్ విజయం. ఆ సిరీస్లో టీమిండియా ఆటగాడు చతేశ్వర పుజారా నాలుగు టెస్టు మ్యాచ్ల్లో 521 పరుగులు సాధించి భారత్ టెస్టు సిరీస్ను గెలవవడంలో ముఖ్య పాత్ర పోషించాడు.
ఈ సీజన్లో చివరిలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లాల్సి ఉండటంతో.. ప్రస్తుతం నంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్న కమిన్స్కు పుజారా బెంగ పట్టుకుంది. దానిలో భాంగా పుజారా బ్యాటింగ్పై కసరత్తు చేస్తున్నాడు. 2018-19 సిరీస్లో పుజార అద్భుతంగా ఆడాడని ప్యాట్ కమిన్స్ శనివారం ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. అయితే ఈసారి అలా పరుగులు చేయనివ్వం అని ఆసీస్ పేసర్ అంటున్నాడు.
'భారత్ తరఫున ఆ సిరీస్లో పుజార గొప్పగా ఆడాడు. అతడు కాస్త సమయం తీసుకొని ఆడతాడు. ఏకాగ్రతను ఎక్కువగా కోల్పోడు. సాధ్యమైనంత వరకూ పుజారా క్రీజ్లో ఉండటానికి యత్నిస్తాడు. సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేసినా.. ఎక్కడ ఆందోళన లేకుండా క్రీజ్లో ఉంటాడు. అది అతనిలో ప్రత్యేకత. పుజారాను ఔట్ చేయడానికి మార్గాలు అన్వేషించాలి. ఈసారి పరిస్థితులు మా జట్టుకు అనుకూలంగా ఉంటాయనుకుంటున్నా. పుజార లాంటి బ్యాట్స్మన్ను ఔట్ చేయాలంటే అతడు కురుకోకుండా ఇబ్బంది పడే బంతులను తరచూ సంధించాల్సిన అవసరం ఉంటుంది' అని కమిన్స్ అన్నాడు.
తాను ఆడే ప్రతీ టెస్టు నుంచి ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి యత్నిస్తూ ఉంటానని కమిన్స్ తెలిపాడు. 'ప్రతీ సిరీస్కు మెరుగు పడుతూ ముందుకు సాగడమే నా లక్ష్యం. టెస్టు క్రికెట్ అనేది చాలా కొత్త పాఠాలను నేర్పుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టెస్టు క్రికెట్ అనేది ఘోరంగా సాగుతుంది. ప్రత్యర్థి జట్లు మొత్తం రోజంతా బ్యాటింగ్ చేస్తే, మరొక సందర్భంలో వారు బ్యాటింగ్ను కుప్పకూల్చడం వంటిది జరుగుతూ ఉంటుంది' అని కమిన్స్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ -13వ సీజన్లో భాగంగా గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అతని కనీస ధర రెండు కోట్లు కాగా.. రసవత్తర పోటీ ఉండడంతో చివరకు రూ. 15.50 కోట్లు వెచ్చించి కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ గుర్తింపు పొందాడు. అయితే కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో కమిన్స్ నిరాశ వ్యక్తం చేసాడు.