టీమిండియాపై బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టుకు బ్యాడ్ న్యూస్ అందింది. జట్టులోని కీలక ప్లేయర్.. త్వరలోనే ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నట్లు తెలిసింది. అతడెవరంటే?
ఇటీవలే ముగిసిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విజయం సాధించి ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది ఆస్ట్రేలియా జట్టు. అయితే ఇప్పుడా జట్టుకు ఓ షాక్ తగిలింది! ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడా లేదా అనేది అనుమానంగా మారింది.

తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్.. లంకతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. ఇందులో కమిన్స్ పేరు లేదు. వ్యక్తిగత కారణాలతో అతడు అందుబాటులో ఉండట్లేదని తెలిపింది. ఎందుకంటే లంకతో సిరీస్ జరిగే సమయానికి కమ్మిన్స్ భార్యకు రెండో డెలివరీ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటే కమ్మిన్స్ కు ప్రస్తుతం చీలిమండ గాయమైంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా చీఫ్ సెలక్టర్ జార్జ్ బెలీ చెప్పాడు. కమిన్స్ కు త్వరలోనే గాయం తీవ్రత తెలుసుకోవడానికి స్కానింగ్ చేస్తారని చెప్పుకొచ్చాడు.
దీంతో, ప్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడా లేదా అనేది ప్రస్తుతం అనుమానంగా మారింది. ఎందుకంటే గాయం తీవ్రత ఎక్కువ ఉంటే అతడు ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశం ఉందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
"కమిన్స్ కు స్వల్ప స్థాయిలో చీలమండ గాయమైంది. నాకు తెలిసి వచ్చే వారం అతడు స్కానింగ్ కు వెళ్తాడు. రిపోర్ట్ లో అతడి గాయం తీవ్రతపై ఓ స్పష్టత వస్తుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు పాల్గొంటాడా లేదా అనేది ప్రస్తుతం కచ్చితంగా చెప్పలేం. స్కానింగ్ రిపోర్ట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే." అని అన్నాడు.
కాగా, ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ బీలో ఉంది. ఈ కేటగిరీలో అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 22న లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో తలపడనుంది.