హైదరాబాద్: ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వన్డే సిరిస్ ముగిసిన అనంతరం భారత్తో జరిగే మూడు టీ20ల సిరిస్కు ఆ జట్టు ప్రధాన పేసర్ ప్యాట్ కమిన్స్ దూరం కానున్నాడు.
ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన చేసింది. నవంబర్ 23 నుంచి యాషెస్ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ప్యాట్ కమిన్స్కు తగినంత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భారత్తో మూడు టీ20ల సిరిస్ నుంచి కమిన్స్ను తప్పించింది.

ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి వన్డే అక్టోబర్ 1(ఆదివారం) నాగ్ పూర్లోని వీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ వన్డే అనంతరం కమ్మిన్స్ స్వదేశానికి పయనం కానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పేర్కొంది. ఈ సిరిస్లో ఇప్పటికే రెండు వన్డేల్లో ఓటమి పాలై ఆసీస్ వెనుకబడింది.
'మా ప్రధాన బౌలర్ కమిన్స్కు భారత్తో జరిగే మూడు టీ20ల సిరీస్ నుంచి విశ్రాంతినిస్తున్నాం. అతడిని సాధ్యమైనంత వరకూ గాయపడకుండా చూసుకోవడం మా బాధ్యత. దానిలో భాగంగా అతనికి విశ్రాంతి ఇవ్వాలని మా సెలక్టర్లు నిర్ణయించారు. కమిన్స్ గాయపడలేదు' అని సీఏ స్పష్టం చేసింది.
మరోవైపు అక్టోబర్లో ఆరంభమయ్యే షెఫల్డ్ ఫీల్డ్ సీజన్కు నూతనోత్తేజంతో బరిలోకి దింపాలనే యోచనలో భాగంగానే అతనికి విశ్రాంతి ఇస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఆదివారం (సెప్టెంబర్ 24)న ఇరు జట్ల మధ్య ఇండోర్లో మూడో వన్డే జరగనుంది.