అడిలైడ్ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కంగారూల గడ్డపై ఏడేళ్ల తర్వాత తొలిసారి గెలుపు రుచి చూసింది. మరోవైపు ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఆల్రౌండ్ షోతో ఆసీస్ను చిత్తుగా ఓడించింది. తొలి వన్డేలో ఆస్ట్రేలియా నెగ్గిన సంగతి తెలిసిందే.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ స్మిత్ (35; 48 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. పాకిస్థాన్ బౌలర్లలో హారిష్ రవూఫ్ అయిదు వికెట్లు, షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షా ఒక్క వికెట్ తీశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆసీస్ను తక్కువ స్కోరుకు కట్టడిచేసింది. అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ 26.3 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

సయిమ్ అయుబ్ (82; 71 బంతుల్లో, 5 ఫోర్లు, 6 సిక్సర్లు), అబ్దుల్లా షఫికి (64 నాటౌట్; 69 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. బాబర్ అజామ్ (15 నాటౌట్; 20 బంతుల్లో, 1 సిక్సర్) పరుగులు చేశాడు. ఆడమ్ జంపా ఆయుబ్ను ఔట్ చేశాడు. షఫికి నిలకడగా పరుగులు సాధించగా, అయుబ్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముచ్చటైన బౌండరీలతో, కళ్లుచెదిరే సిక్సర్లతో అలరించాడు.
కాగా, మ్యాచ్ అనంతరం ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. బ్యాటింగ్లో వైఫల్యమే తమ ఓటమికి కారణమని చెప్పాడు. పాక్ బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారని, అయితే తాము కాస్త మెరుగైన స్కోరు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఎటాకింగ్ బౌలింగ్, ఫీల్డింగ్తో స్కోరును కాపాడుకోవడానికి ప్రయత్నించామని, కానీ అది జరగలేదని తెలిపాడు. ఇక మూడో వన్డే సారథి బాధ్యతలు జోష్ ఇంగ్లిస్కు అప్పగిస్తున్నానని, భారత్తో టెస్టు సిరీస్కు సిద్ధమవుతామని కమిన్స్ పేర్కొన్నాడు. నవంబర్ 22 నుంచి మొదలయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మెరుగైన ప్రాక్టీస్ చేస్తామని అన్నాడు.