క్రికెట్ అభిమానులు అనుకున్నట్టే జరిగింది! ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బే తగిలేతట్టుంది. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ప్యాట్ కమిన్స్ దూరం కావడం దాదాపుగా ఖాయమని తెలిసింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ చెప్పాడు. అతడి స్థానంలో కెప్టెన్ గా జట్టును ఎవరు నడిపిస్తారనే విషయాన్ని కూడా తెలిపాడు.
హింట్ ఇచ్చిన ఆండ్రూ
గత కొంత కాలంగా కమిన్స్ చీలమండ సమస్యతో ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే. టీమిండియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తర్వాత ఈ నొప్పి మళ్లీ తిరగబెట్టింది. పైగా అదే సమయంలో కమిన్స్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కారణంగా అతడు శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. దీంతో కమిన్స్ స్థానంలో లంక సిరీస్కు స్టీవ్ స్మిత్ సారథిగా ఎంపికయ్యాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కమిన్స్ గాయం మళ్లీ తిరగబెట్టడం ఆసీస్ క్రికెట్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేసింది. దీంతో అతడు ఈ మెగా టోర్నీలో ఆడతాడా? లేదా? అని కలవరపడ్డారు. అయితే ఆ అనుమానాలకు తెరదించుతూ అతడి నేతృత్వంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ప్రకటించింది ఆసీస్ క్రికెట్ బోర్డ్. కానీ ఇప్పుడు మళ్లీ అతడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకపోవచ్చని.. ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ హింట్ ఇచ్చారు.
తాజాగా లంకతో జరిగే వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా స్క్వాడ్ బయలుదేరింది. అందులో పాట్ కమిన్స్ లేడు. ఈ విషయమై ఆండ్రూ మెక్ డొనాల్డ్ మాట్లాడుతూ.. "పాట్ కమిన్స్ ఇప్పట్లో తన బౌలింగ్ ను మళ్లీ ప్రారంభించలేదు. అతడు గాయం ఇంకా తగ్గలేదు. అందుకే ఇప్పుడు మాకో కెప్టెన్ అవసరం. స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ ఒకరిని ఎంపిక చేయాలని చర్చలు జరుగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి వారిని సిద్ధం చేయాలి." అని పేర్కొన్నాడు.
అతడిపై ప్రశంసలు
ఇంకా స్మిత్ నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు కురిపించాడు ఆండ్రూ మెక్ డొనాల్డ్. లంకతో జరిగిన తొలి టెస్ట్ తో స్మిత్ అద్భుతంగా రాణించాడని చెప్పిన అతడు.. అంతర్జాతీయ వన్డేల్లో స్మిత్ ప్రదర్శన బాగుందని పొగిడాడు.