బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాను ఓడిస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. తమ సొంత గడ్డపై గత రెండు సార్లు కోల్పోయనప్పటికీ ఈసారి మాత్రం ఫలితం భిన్నంగా ఉంటుందని పేర్కొన్నాడు. భారత్తో తలపడిన చివరి టెస్టులో తమ జట్టే విజయం సాధించి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ గెలిచిందని గుర్తు చేశాడు.
1996 నుంచి భారత్-ఆసీస్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. అయితే 2016 నుంచి టీమిండియానే ఈ ట్రోఫీని వరుసగా గెలుస్తోంది. 2016/17, 2022/23లో భారత్, 2018/19, 2020/21లో ఆస్ట్రేలియా ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చాయి. స్వదేశంలో పాటు కంగారూల గడ్డపై టీమిండియానే పైచేయి సాధిస్తోంది.

''ఆస్ట్రేలియాలో జరిగిన గత రెండు సిరీస్లను మేం గెలవలేకపోయాం. ఇది చాలా కాలంగా సాగింది. అయితే ఈసారి మార్పుకు సమయం వచ్చిందని ఆశిస్తున్నా. మమ్మల్ని వాళ్ల ఓడించిన అదే మైదానాల్లో మేం ఎన్నో మ్యాచ్లు ఆడాం. అలాగే వాళ్లపై మేం ఎన్నో విజయాలు సాధించాం. దాని నుంచి మేం విశ్వాసం మరింత పొందుతాం''
''ఇక చివరి టెస్టు మ్యాచ్ను మేమే విజయం సాధించాం. తటస్థ పరిస్థితుల్లో (లండన్లో లార్డ్స్ వేదికగా) పైచేయి సాధించి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ గెలిచాం. భారత్లో ఎల్లప్పుడూ తీవ్రమైన పోటీ ఉంటుంది. 50-50 ఛాన్స్లా అనిపిస్తుంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను'' అని కమిన్స్ పేర్కొన్నాడు. 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్పై ఆస్ట్రేలియా గెలిచిన సంగతి తెలిసిందే.
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.