
హైదరాబాద్: విరాట్ కోహ్లీపై కామెంట్స్ చేసి తానే దిగి వచ్చాడు ఆస్ట్రేలియా బౌలర్. తాను చేసిన కామెంట్లపై ఉద్దేశ్యం వేరే ఉందంటూ వెల్లడించాడు. ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కొహ్లీపై చేసిన కామెంట్స్కు ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ చానల్ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. భారత్తో జరుగనున్న సిరీస్లో కొహ్లీని సెంచరీ చేయనివ్వనని కమిన్స్ ధీమాగా చెప్పాడు.
కమిన్స్ కామెంట్స్తో కొంతమంది భారత క్రికెట్ అభిమానులు సీరియస్ అయ్యారు. కోహ్లీపై అతను చేసిన కామెంట్లను కించపరిచినట్లుగా ఉన్నాయని భావించిన అభిమానులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆస్ట్రేలియా పేసర్పై ఘాటుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో కొహ్లీపై తాను చేసిన వ్యాఖ్యలను కమిన్స్ సమర్ధించుకున్నాడు. తాను కేవలం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ అయిన విరాట్కు కాంప్లిమెంట్స్ మాత్రమే ఇచ్చానన్నాడు.
కోహ్లీని సెంచరీ చేయకుండా కట్టడి చేస్తే తమ జట్టు సులువుగా విజయం సాధించగలుగుతుందనే ఉద్దేశంతోనే అలా అన్నానంటూ వివరణ ఇచ్చాడు. ప్యాట్ కమిన్స్ కామెంట్స్ను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేకపోయినా.. కొంతమంది ఫ్యాన్స్ కావాలనే దుష్ప్రచారం చేశారు.కమిన్స్ ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి ఇంతటితో తెర పడినట్లే.
ప్రస్తుతం జూలై 3 నుంచి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా సెప్టెంబర్ 11తో పూర్తి చేసుకుంటుంది. 3 టీ20లు, 3 వన్డేలు, 5టెస్టు మ్యాచ్లు ఆడనున్న టీమిండియా.. నవంబరు 21 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. జనవరి 18 వరకూ జరగనున్న ఈ పర్యటనలో 3 టీ20లు, 4టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది.