అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో మహ్మద్ సిరాజ్ - ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన గొడవ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రావిస్ హెడ్ను మహ్మద్ సిరాజ్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో గొడవ మొదలైంది.
సిక్సర్ బాది జోరు మీదున్న ట్రావిస్ హెడ్ను సిరాజ్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. లోకల్ బాయ్ హెడ్ను అద్భుతమైన యార్క్ర్తో బోల్తాకొట్టించాడు. అయితే సిరాజ్ సంధించిన బంతికి సమాధానం చెప్పలేకపోయిన హెడ్.. అనంతరం మాటలతో బదులిచ్చాడు. మరోవైపు సిరాజ్ తగ్గేదేలా అంటూ ఇక వెళ్లిపో.. అంటూ సింబాలిక్గా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది.

దీనిపై ట్రావిస్ హెడ్ స్పందిస్తూ.. తాను బాగా బౌలింగ్ చేశావని మెచ్చుకున్నానని, కానీ సిరాజ్ మాత్రం అపార్థం చేసుకున్నాడని అన్నాడు. మరోవైపు సిరాజ్ మాట్లాడుతూ.. ట్రావిస్ హెడ్ అబద్దాలు చెప్పాడని, టీవీలో రిప్లే చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని తెలిపాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ప్యాట్ కమిన్స్ దీని గురించి స్పందించమని కోరగా, అతను కీలక వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వేడి రాజుకుందని, తన భయమంతా తన ఆటగాళ్ల గురించే అని కమిన్స్ అన్నాడు.
''భారత్ ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. భయమంతా నా ఆటగాళ్ల గురించే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వేడి రాజుకుంది. ఇది పెద్ద సిరీస్. ప్రేక్షకులతో అన్ని రోజులు స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఈ క్రమంలో తీవ్రత, ఆసక్తి, ఒత్తిడి ప్రతిబింబిస్తాయి. ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్. అతను తన గురించి తాను మాట్లాడగలడు'' అని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా, శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.