హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ పర్వేజ్ రసూల్ ఎట్టకేలకు 'చూయింగ్ గమ్ వివాదం'పై స్పందించాడు. క్రికెటర్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని అభ్యర్ధించాడు. తాజాగా మంగళవారం ఓ జాతీయ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్యూలో అతడు దీనిపై స్పందించాడు.
'క్రికెటర్లను క్రికెట్ ఆడుకోనివ్వండి. దయచేసి అనవసరంగా రాజకీయాల్లోకి లాగకండని అభ్యర్ధించాడు. నా ఫోకస్ మొత్తాన్ని గేమ్ పైనే ఉంచాలని అనుకుంటున్నా. ఇలా అనవసర వివాదాల్లోకి లాగొద్దు. తన ప్రాంతం నుంచి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమనేదే చాలా గొప్ప విషయం' అని చెప్పుకొచ్చాడు.

జమ్మూ కాశ్మీర్కు చెందిన పర్వేజ్ రసూల్ జనవరి 26న కాన్పూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో చూయింగ్ గమ్ నములుతూ కనిపించడంతో అతడిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో రసూల్ తీరుని టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో చూసిన క్రికెట్ అభిమానులు అతడిని జట్టులో నుంచి తొలగించాలంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 'జనగణమన' పాడుతున్న సమయంలో చ్యూయింగ్ గమ్ నములుతూ పర్వేజ్ కనిపించడంపై ఫ్యాన్స్ మండిపడ్డారు.