హైదరాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరిస్లో చోటు సంపాదించుకుని అందరి చేత అభినందనలు అందుకున్న జమ్మూ కాశ్మీర్ ఆటగాడు పర్వేజ్ రసూల్ కాన్పూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో తన ప్రవర్తనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించగా, పర్వేజ్ రసూల్ నిర్లక్ష్యంగా ఉండటంతో పాటు చూయింగ్ గమ్ నములుతూ కనిపించాడు. ఈ సమయంలో రసూల్ తీరుని ప్రత్యక్ష ప్రసారంలో చూసిన క్రికెట్ అభిమానులు అతడిని జట్టులో నుంచి తొలగించాల్సిందిగా సూచించారు.

'జనగణమన' పాడుతున్న సమయంలో చ్యూయింగ్ గమ్ నములుతూ పర్వేజ్ కనిపించడాన్ని క్రికెట్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుత ప్రతిభ కనబరిచిన రసూల్ని అశ్విన్ స్ధానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరిస్కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
2009లో పర్వేజ్ రసూల్ జీవితంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ది టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం అండర్-22 ట్రోఫీలో భాగంగా గతంలో కర్ణాటక జట్టుపై బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన రసూల్ వద్ద పేలుడు పదార్థాలు ఉన్నాయని భావించిన పోలీసులు, అతన్ని అడ్డుకుని అణువణువూ సోదాలు చేశారు.
అప్పట్లో అతడికి అండగా నిలిచిన క్రికెట్ అభిమానులు తాజా ఘటనపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. కాగా, తన కెరీర్లో మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడిన పర్వేజ్ రసూల్ 4 ఓవర్లు బౌల్ చేసి 32 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.