ఐపీఎల్ ప్రతి సీజన్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. 17 సీజన్లు ట్రోఫీ లేకుండానే ముగించింది. కానీ ప్రతిసారీ విజేతగా నిలిచేలా సంచలన ప్రదర్శనలు చేస్తుంటుంది. మూడు సార్లు ఫైనల్కు చేరి తృటిలో కప్ను కోల్పోయింది. మొత్తంగా తొమ్మిది సార్లు ప్లేఆఫ్స్కు చేరింది.
అయితే బలమైన ఆటగాళ్లు, గేమ్ ఛేంజర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ కప్ గెలవకపోవడానికి గల కారణాలను ఆ జట్టు మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ వివరించాడు. జట్టుగా కంటే వ్యక్తులపైనే ఫ్రాంచైజీతో సహా అందరూ ఆధారపడటమే ఆర్సీబీ కప్ కల నిరీక్షణ కొనసాగుతోందని అభిప్రాయపడ్డాడు. కోహ్లి, గేల్, డివిలియర్స్కు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే ఆర్సీబీ కొంపముంచిందని చెప్పాడు. బెంగళూరు తరఫున తాను ఆడిన నాలుగేళ్ల అనుభవంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని పార్థివ్ పేర్కొన్నాడు.

''ఆర్సీబీ తరఫున నాలుగేళ్లు ఆడాను. ఆ టీమ్ ఎప్పుడూ వ్యక్తులపైనే ఆధారపడి ఉంటుంది, జట్టుపై కాదు. ఆర్సీబీ నుంచి బయటకు వచ్చిన ప్రతిఒక్కరూ ఇదే మాట చెబుతారు. నేను జట్టులో ఉన్నప్పుడు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వల్లేనే ఇదంతా జరిగింది. ఆర్సీబీలో వాళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. జట్టు సంస్కృతి లేదు. ఆడేటప్పుడు ఈ విషయాన్ని గమనించవచ్చు. ఇప్పటివరకు ఆ జట్టు ట్రోఫీని గెలవకపోవడానికి ఇదే కారణం. ఇది నిజం'' అని పార్థివ్ పటేల్ అన్నాడు.
క్రిస్ గేల్, డివిలియర్స్ లీగ్కు వీడ్కోలు పలికారు. కానీ గత 17 ఏళ్లుగా ఆర్సీబీతోనే కోహ్లి ఉన్నాడు. ఐపీఎల్-2024 సీజన్లోనూ కోహ్లి ఆర్సీబీ కోసం గొప్పగా పోరాడాడు. 15 మ్యాచ్ల్లో 61 సగటుతో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. కానీ బెంగళూరు టైటిల్ సాధించడంలో విఫలమైంది. అయితే వరుసగా ఆరు విజయాలు సాధించి ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరింది. కానీ కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమిపాలై మరోసారి ట్రోఫీ లేకుండానే సీజన్ను ముగించింది.