నగదుతో కూడిన ఆన్లైన్ గేమింగ్ను నిషేధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉభయ సభళ్లో చర్చ లేకుండానే ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు ఆమోదం లభించింది. గురువారం ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లుకు ఆమోదం లభించడం గమనార్హం.
లోక్ సభలో ఆమోదం పొందిన తర్వాత.. రాజ్యసభలో మూజువాణి ఓటు ద్వారా "ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు" ఆమోదం పొందింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్లను ఆడితే గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, "ఆన్లైన్ మనీ గేమింగ్ వ్యసనం డ్రగ్స్ వ్యసనం లాంటిది. ఈ గేమ్ల వెనుక ఉన్న శక్తివంతమైన వ్యక్తులు కోర్టులలో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తారు. ఈ నిషేధానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో ప్రచారాలు కూడా నిర్వహిస్తారు. ఈ ఆన్లైన్ మనీ గేమింగ్ వల్ల కలిగే నష్టాలు, డబ్బును ఎలా ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారో మనం చూశాం" అని అన్నారు.
సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, బిల్లుపై చర్చ లేకుండానే ఆమోదించడంపై ఫిర్యాదు చేశారు. అయితే..ప్రతిపక్షాల నిరంతర నిరసనల మధ్య అటువంటి చర్చ ఎలా సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు. ఈ బిల్లుపై చర్చతో పాటు, బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణపై కూడా ప్రతిపక్షాలు చర్చ కోరాయి.
బిల్లులో కీలక అంశాలు:
ఆన్లైన్ మనీ గేమ్లను ఆడేందుకు డబ్బు డిపాజిట్ చేసి, డబ్బు గెలుచుకోవాలని ఆశించే ఆటలను ఈ బిల్లు నిషేధిస్తుంది.ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ నుంచి ఆన్లైన్ బెట్టింగ్ (పోకర్, రమ్మీ, ఇతర కార్డ్ గేమ్లు), ఆన్లైన్ లాటరీల వరకు అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, జూదం (సట్టా, జువా) కార్యకలాపాలను ఇది నిషేధిస్తుంది. ఆన్లైన్ మనీ గేమ్లకు సంబంధించిన ప్రకటనలను నిషేధిస్తుంది. ఈ ఆటలకు నిధులు బదిలీ చేయకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలను కూడా ఇది నిషేధిస్తుంది.
శిక్షలు:
*మనీ గేమ్ల ప్రకటనలు చేస్తే గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా పడుతుంది.
*మనీ గేమ్లకు ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా విధించవచ్చు.
*పదేపదే నేరాలు చేస్తే, శిక్షలు పెరుగుతాయి. మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2 కోట్లు వరకు జరిమానా విధించవచ్చు.
*ఈ చట్టం ప్రకారం, కొన్ని ముఖ్య సెక్షన్ల కింద నేరాలు శిక్షార్హమైనవి, నాన్ బెయిలబుల్గా పరిగణించబడతాయి.