పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. విశ్వక్రీడలు అధికారిక ప్రారంభోత్సవం రేపు అట్టహాసంగా జరగనుంది. సెన్ నదిపై ఈ వేడుకులు జరగనున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో ఆరంభోత్సవ వేడుకుల స్టేడియంలో కాకుండా తొలిసారి ఆరుబయట నదిలో నిర్వహిస్తున్నారు. కాగా, క్రీడా మహాసమరంలో ఇప్పటికే కొన్ని ఆటలు ప్రారంభమయ్యాయి.
ఫుట్బాల్, రగ్బీ సెవెన్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇవాళ భారత ఆర్చర్లు సమరంలోకి దిగనున్నారు. వ్యక్తిగత రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్తో మన ఆర్చర్లు పోటీపడనున్నారు. అయితే గత టోక్యో ఒలింపిక్స్ను ఏడాది పాటు ఆలస్యం చేసిన మహమ్మారి కొవిడ్ మరోసారి విశ్వక్రీడలకు ఆటంకం కలిగించేలా క్రమంగా విజృంభిస్తోంది. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఐదుగురు క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.

ఆస్ట్రేలియా క్రీడాకారులకు కొవిడ్ సోకిందని అధికారులు తెలిపారు. వాటర్ పోలో మహిళల జట్టులో ఐదుగురికి కరోనా వచ్చిందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా బృందంలోని మిగిలిన వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే కరోనా బారిన పడిన ఆ ఐదుగురు కూడా క్షేమంగానే ఉన్నారని, అంతేగాక వాళ్లు తమ క్రీడల్లో పాల్గొంటారని అధికారులు స్పష్టం చేశారు.
కొవిడ్ కూడా ఇతర శ్వాసకోస సంబంధిత అనారోగ్యం వంటిదేనని, దాన్ని ముప్పుగా భావించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం క్రీడాగ్రామంలో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, క్రీడాకారులను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. కరోనా కారణంగా గత టోక్యో ఒలింపిక్స్ కఠిన నిబంధనల మధ్య జరిగిన విషయం తెలిసిందే. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ కూడా ప్రత్యేక నిబంధనల మధ్య జరిగింది.
కాగా, పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి 16 క్రీడల్లో 117 మంది పోటీపడుతున్నారు. గత టోక్యో ఒలింపిక్స్లో 18 క్రీడల్లో 127 మంది పాల్గొన్నారు. ఏడు పతకాలు సాధించారు. 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలతో భారత్ 48వ స్థానంలో నిలిచింది. ఈసారి మెరుగైన ప్రదర్శన చేసి పతకాల సంఖ్యను పెంచాలని భారత క్రీడాకారులు పట్టుదలతో ఉన్నారు.