
టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అర్ష్దీప్ సింగ్ను ప్రశంసించాడు. ఒత్తిడిలో చాలా ప్రశాంతంగా బౌలింగ్ చేయగల సమర్థుడు అర్షదీప్ అంటూ ప్రశంసించాడు. ఇప్పటివరకు మూడు టీ20 మ్యాచ్లు ఆడిన అర్షదీప్ సింగ్ ఐదు వికెట్లు తీసుకోవడమే కాకుండా 5.91ఎకానమీతో బౌలింగ్ చేయగలిగాడు. అర్ష్దీప్ సింగ్ జాతీయ జట్టుతో స్వల్ప వ్యవధిలోనే తన అత్యుత్తమ ప్రదర్శనతో వెలుగులోకి రాగలిగాడు. వెస్టిండీస్తో జరిగిన రెండు టీ20 మ్యాచ్ల్లో అర్ష్దీప్ 6.25ఎకానమీతో మూడు వికెట్లు తీశాడు. బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు తీయగా.. వార్నర్ పార్క్లో జరిగిన రెండవ మ్యాచ్లోనూ డెత్ ఓవర్లలో అద్భుతంగా ఆడడమే కాకుండా ఓ వికెట్ తీశాడు.
సెయింట్ కిట్స్లో వెస్టిండీస్కు చివరి నాలుగు ఓవర్లలో విజయానికి 31పరుగులు అవసరమైన దశలో అర్ష్దీప్ తన 17వ, 19వ ఓవర్లలో వరుసగా 4, 6 పరుగులు మాత్రమే ఇచ్చి కట్టడిగా బౌలింగ్ చేశాడు. 2021 నవంబర్లో భారత జట్టు బౌలింగ్ కోచ్గా మాంబ్రే నియమితుడయ్యాడు. ఇక పవర్ప్లే, డెత్ ఓవర్లలో సరైన రీతిలో బౌలింగ్ చేసినందుకు అర్ష్దీప్ను ప్రశంసించాడు. 'నేను చాలా కాలంగా అర్షదీప్ను చూస్తున్నాను. ఐపీఎల్లో కూడా అతనెలా బౌలింగ్ చేశాడో చూశా.
ఒత్తిడిని అధిగమించే అతని సామర్థ్యం నిజంగా ప్రత్యేకమని చెప్పాలి. అతను హార్డ్ ఓవర్లు, పవర్ప్లేలో మరియు డెత్ ఓవర్లలో కూడా చక్కగా బౌలింగ్ చేస్తాడు. అతను ఆటలో చూపే ప్రశాంతత ను చూస్తుంటే నేను చాలా సంతోషిస్తా. ముఖ్యంగా రెండో టీ20లో అతను ఆడిన అమోఘం. అతను 17వ ఓవర్లో వేసిన బౌలింగ్.. అతని పటిమను చూపించింది. అతను జట్టు కోసం ఎలాంటి తరహాలో బౌలింగ్ చేయాలో చూపించడం చాలా సంతోషంగా ఉంది' అని మాంబ్రే అన్నాడు.
అర్ష్దీప్ బౌలింగ్లో అదరగొట్టినప్పటికీ.. రెండో టీ20లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఒబెడ్ మెక్కాయ్ ఆరు వికెట్లు తీయడంతో మెన్ ఇన్ బ్లూ 19.4 ఓవర్లలో 138పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ హాఫ్ సెంచరీ, డెవాన్ థామస్ ఫినిషింగ్ వల్ల కరీబియన్ జట్టు 19.2ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.