టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఉగాండ తొలి విజయాన్ని నమోదు చేసింది. గయానా వేదికగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఈ చారిత్రక గెలుపును సాధించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. అయితే పసికూనల పోరులో ఉగాండకు గెలుపు రుచి అంత సులువుగా దక్కలేదు. స్లో పిచ్పై సాగిన ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో అంతిమంగా పపువా న్యూగినియాపై ఉగాండ పైచేయి సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 19.1 ఓవర్లలో 77 పరుగులకు ఆలౌటైంది. హిరి హిరి (15; 19 బంతుల్లో, 2 ఫోర్లు), లెగా సియాక (12; 17 బంతుల్లో, 1 ఫోర్), కిప్లిన్ (12; 20 బంతుల్లో, 1 సిక్సర్) మినహా మిగిలనెవరూ రెండంకెల స్కోరు అందుకోలేదు. ఉగాండ బౌలర్లలో అల్పేష్ రంజానీ, కాస్మస్, జుమా మియాగీ, ఫ్రాంక్ న్సుబుగా తలో రెండు వికెట్లు తీశారు. 43 ఏళ్ల న్సుబుగా నాలుగు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు.

అనంతరం ఛేదనలో ఉగాండ 18.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. అయితే ఉగాండ ఆదిలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 1/1, 6/2, 6/3, 25/4, 26/5తో వరుసగా వికెట్లుగా కోల్పోయింది. దీంతో మ్యాచ్ పపువా వైపు మళ్లింది. అయితే ఈ స్థితిలో బ్యాటింగ్కు వచ్చిన జుమా మియాగీ (13; 16 బంతుల్లో)తో కలిసి రియాజత్ అలీషా (33; 56 బంతుల్లో, 1 ఫోర్) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
రియాజత్-మియాగీ ఆరో వికెట్కు 35 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ఇద్దరూ పెవిలియన్కు చేరారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. అయితే టెస్టు ఫార్మాట్లా తలపించిన ఈ పోరులో అంతిమంగా ఉగాండ విజయతీరాలకు చేరింది. కెన్నెత్ (7 నాటౌట్; 16 బంతుల్లో) పొరపాటు చేయకుండా జట్టును గెలిపించాడు.