New Zealand vs Pakistan 2nd T20I: పాకిస్థాన్ క్రికెట్ కు దురదృష్టం వెంటాడుతోనే ఉంది. న్యూజిలాండ్ తో జరుగుతోన్నఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను ఓటమితో ప్రారంభించిన పాక్ జట్టు.. ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్ లోనూ పరాజయం పొందింది. ఐదు వికెట్లు తేడాతో ఓడిపోయింది. దీంతో న్యూజిలాండ్ 2-0 తేడాతో సిరీస్ లో ఆధిక్యం సంపాదించింది. ఫలితంగా పాకిస్థాన్ జట్టుపై సోషల్ మీడియాలో మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి. కాగా, అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ దారుణ వైఫల్యంతో పాకిస్థాన్ లీగ్ స్టేజ్ నుంచి ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే.
ఆఖర్లో అతడు మెరుపులు..
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. పాకిస్థాన్ బ్యాటర్లలో కెప్టెన్ సల్మాన్ అఘా 28 బంతుల్లో 4 పోర్లు, 3 సిక్స్ ల సాయంతో 6 పరుగులు చేశాడు. షాదాబ్ ఖాన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 26 పరుగులు చేశాడు. చివర్లో షహీన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 22 పరుగులు అదరగొట్టాడు. ఇక మిగతా వారు విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో జాకోబ్ డఫ్పీ, బెన్ సీర్స్, నీషమ్ ఇష్ సోదీ తలో రెండో వికెట్లు తీశారు.

ఆ ఇద్దరు అదుర్స్..
అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 13.1 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. కివీస్ కు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో 45 పరుగులు చేయగా... ఫిన్ అలెన్ 16 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్ ల సాయంతో 38 పరుగులు చేశారు. వీరిద్దరు తొలి వికెట్ కు 66 పరుగులు జోడించారు. మార్క్ చాప్ మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్ నామమాత్రపు పరుగులు చేశారు. మిచెల్ హే, మైఖేల్ బ్రేస్ వెల్ నాటౌట్ గా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో హ్యారిస్ రౌఫ్ 2 వికెట్లు, తీయగా, మహ్మద్ అలీ, ఖుష్దిల్ షాన్, జహ్నాద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
వర్షం అంతరాయం
పాకిస్థాన్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ రెండో టీ20 మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో దాదాపు 15 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు నిర్వహాకులు.