NZ vs PAK: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. అక్కడ పాకిస్థాన్ జట్టు ఐదు మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్ ఆడింది. ఈ మ్యాచ్ల టీ20 సిరీస్ను పాకిస్థాన్ జట్టు 4-1 తేడాతో కోల్పోయింది. వన్డే సిరీస్లో పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ను ఓడించడం ద్వారా విజయవంతమైన ఆరంభాన్ని ఆశిస్తోంది. కానీ అది జరగలేదు. నేపియర్లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 73 పరుగుల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
కివీస్ తుఫాన్ ఇన్నింగ్స్
ముందుగా బ్యాటింగ్ కివీస్ జట్టు మార్క్ చాప్మన్(132) అద్భుత సెంచరీ, డారిల్ మిచెల్(84) తుఫాన్ ఇన్నింగ్స్తో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. తన కెరీర్ లో న్యూజిలాండ్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న పాక్ జాతీయుడు మహమ్మద్ అబ్బాస్ తన జన్మదేశంపై విరుచుకుపడ్డాడు. 26 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో ఇర్ఫాన్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హారిస్ రౌఫ్, అకీఫ్ జావెద్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. నసీమ్ షా, మహమ్మద్ అలీ తలో వికెట్ పడగొట్టారు. పాక్ బౌలర్లు వికెట్లు తీసినప్పటికీ.. హారిస్ రౌఫ్ తప్ప మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.

271 పరుగులకు ఆలౌట్
దీనికి ప్రతిస్పందనగా ఛేదనకు దిగిన పాకిస్థాన్ జట్టు 44.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం 78 పరుగులతో రాణించాడు. బాబర్ ఆజం 83 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (36), ఉస్మాన్ ఖాన్(39) తొలి వికెట్ కు 83 పరుగులు జోడించి.. ఇద్దరూ 5 పరుగుల వ్యవధిలో వరుసగా ఔటయ్యారు. అనంతరం బాబర్ ఆజమ్(78).. మహ్మద్ రిజ్వాన్(30), సల్మాన్ ఆఘా(58)ల సాయంతో భారీ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. బాబర్ ఆజం 249 పరుగుల స్కోర్ వద్ద నాలుగో వికెట్ గా వెనుదిరగడంతో పాక్ పతనం ప్రారంభమైంది. బాబర్ ఆజం క్రీజులో ఉన్నంత సేపు ఈ మ్యాచ్ లో పాక్ విజయం సాధించేలా కనిపించింది. బాబర్ ఆజం ఔట్ కవడంతో పాకిస్థాన్ ఇన్నింగ్ ఒక్కసారిగా పతనమైంది. 22 పరుగుల వ్యవధిలో జట్టు మిగతా ఆరు వికెట్లు కోల్పోయి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ నాలుగు వికెట్ల పడగొట్టాడు. జాకబ్ డఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. విలియమ్ ఓరూర్కీ, బ్రేస్వెల్, మహ్మద్ అబ్బాస్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్ ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఏప్రిల్ 2న హ్యామిల్టన్ లో జరుగుతుంది.
అరంగేట్ర మ్యాచ్లోనే అబ్బాస్ రికార్డు
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ తరఫున అరంగేట్ర ఆటగాడు మహ్మద్ అబ్బాస్ 26 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ సమయంలో మహ్మద్ అబ్బాస్ కొత్త రికార్డు సృష్టించాడు. వన్డే అరంగేట్ర మ్యాచ్ లో అత్యంత వేగవంతమైన అర్థసెంచరీ సాధించిన రికార్డును మహ్మద్ అబ్బాస్ నెలకొల్పాడు. మహ్మద్ అబ్బాస్ 24 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అంతకు ముందు కృనాల్ పాండ్యా తన అరంగేట్ల మ్యాచ్ లో 26 బంతుల్లో ఈ ఘనతను సాధించాడు.