Asia cup 2025:ఆసియా కప్లో భాగంగా బుధవారం యూఏఈతో జరగాల్సిన కీలక మ్యాచ్కు ముందు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ సృష్టించిన డ్రామాకు తెరపడింది. మ్యాచ్ ఆడకుండా వెనక్కి తగ్గుతామని బెదిరించిన పాక్, చివరికి మైదానంలోకి అడుగుపెట్టింది. అయితే, అంతకుముందు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.దీంతో అసలు ఏం జరిగిందనే దానిపై తెర వెనుక సాగిన చర్చలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
పైక్రాఫ్ట్పై పాకిస్తాన్ ఆరోపణలు.. ఐసీసీ స్పందన
సెప్టెంబర్ 14న భారత్తో జరిగిన మ్యాచ్లో టాస్ సమయంలో కెప్టెన్లు సల్మాన్, సూర్యకుమార్ షేక్హ్యాండ్ ఇచ్చుకోకపోవడం, టీమ్ షీట్స్ మార్చుకోకపోవడంపై వివాదం మొదలైంది. ఈ ఘటనకు పైక్రాఫ్టే కారణమని, అతడు క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని పీసీబీ ఆరోపించింది. పైక్రాఫ్ట్ను ఆసియా కప్ విధుల నుంచి తప్పించాలని కూడా డిమాండ్ చేసింది.

అయితే, ఈ ఆరోపణలపై ఐసీసీ (ICC) వెంటనే సమీక్ష నిర్వహించింది. తమ దర్యాప్తులో పైక్రాఫ్ట్ ఎలాంటి నిబంధనలనూ ఉల్లంఘించలేదని,మ్యాచ్ నిర్వహకుడి నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే ఇరు జట్ల కెప్టెన్లకు తెలియజేశాడని ఐసీసీ తేల్చి చెప్పింది. పీసీబీ ఆరోపణలను తోసిపుచ్చుతూ,పైక్రాఫ్ట్ను తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ,పీసీబీ తన వైఖరి మార్చుకోలేదు.
క్షమాపణల వెనుక అసలు కథ ఇదే!
ఈ వివాదంపై ఆండీ పైక్రాఫ్ట్ సూచనతోనే ఐసీసీ ఒక సమావేశం ఏర్పాటు చేసింది.ఆ సమావేశంలో పైక్రాఫ్ట్ మాట్లాడారు.ఏదైనా అపార్థం జరిగి ఉంటే అందుకు తాను చింతిస్తున్నట్లు వెల్లడించారు.అయితే,తాను కేవలం ఆదేశాలను మాత్రమే పాటించినట్లు పేర్కొన్న ఆండీ..తన బాధ్యతలను అతిక్రమించలేదని స్పష్టం చేశారు.ఈ ప్రకటననే పాక్ క్రికెట్ బోర్డు తమకు క్షమాపణగా చెప్పినట్లు ప్రచారం చేసుకుంది.
అంతేకాకుండా, సెప్టెంబర్ 15న జరిగిన మ్యాచ్లోనూ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారంటూ పీసీబీ ఐసీసీకి మరో ఈ-మెయిల్ పంపింది.దీనికి స్పందించిన ఐసీసీ, పాక్ ఆరోపణలకు సరైన ఆధారాలను సమర్పించాల్సిందిగా కోరింది.ఆ వివరాల కోసం ఐసీసీ ఎదురుచూస్తోందని ఒక ఐసీసీ అధికారి వెల్లడించారు. ఈ పరిణామాలన్నీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరును మరోసారి బట్టబయలు చేశాయి.