భారత్ ట్యాంపరింగ్ చేసి విజయాలు సాధిస్తుందని పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలపై టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి మండిపడ్డాడు. ఇండియాపై పాకిస్థాన్ ఏడుస్తూనే ఉంటుందని, వాళ్లు జీవితంలో మారరని అన్నాడు. చీలమండల గాయానికి శస్త్రచికిత్స చేసుకున్న అనంతరం తిరిగి కోలుకుంటున్న షమి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. విరాట్ కోహ్లితో ఉన్న అనుబంధం గురించి వివరించాడు.
''పాకిస్థానీలు మాపై విషం గక్కుతూనే ఉంటారు. ఎప్పటికీ వాళ్లు మారరు. ఒకరేమో మ్యాచ్లో మాకు భిన్నమైన బంతిని ఇచ్చారు అంటారు. మరొకరు ఏమో బంతిలో చిప్ ఉందని అంటారు. ఓ బౌలర్ బంతిని స్వింగ్, రివర్ స్వింగ్తో బౌలింగ్ చేస్తున్నాడంటే అది నైపుణ్యం. మేం అది చేస్తుంటే.. బాల్ ట్యాంపరింగ్ చేశామని, బంతిలో చిప్ ఉందని వాళ్లు అంటున్నారు'' అని షమి అన్నాడు.

విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ.. ''విరాట్ కోహ్లి, ఇషాంత్ శర్మ నా బెస్ట్ ఫ్రెండ్స్. నేను గాయపడినా, కోలుకుంటున్న సమయంలో నాకు ఫోన్ చేసి ఎలా ఉందని పరామర్శించే వాళ్లలో వాళ్లు ఒక్కరు. ఇక కోహ్లితో అనుబంధం గొప్పగా ఉంటుంది. నెట్స్లో ఒకరిపై ఒకరం సవాలు విసురుకుంటాం, సరదాగా ఉంటుంటాం. మా ఫ్రెండ్షిప్, మా బంధం ఎలా ఉంటుందో ఇది చూపిస్తుంది'' అని షమి పేర్కొన్నాడు.
వన్డే వరల్డ్ కప్-2023 అనంతరం షమి టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. చీలమండల గాయానికి శస్త్రచికిత్స చేసుకోవడంతో కొన్ని నెలల పాటు షమి నడవడానికే ఇబ్బంది పడ్డాడు. క్రమంగా కోలుకున్న షమి మునపటిలా బంతులు సంధిస్తున్నాడు. బంగ్లాదేశ్ లేదా న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్కు షమి తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సెప్టెంబర్ నుంచి భారత్ స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టులు, కివీస్తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. బంగ్లాతో సెప్టెంబర్ 19, న్యూజిలాండ్తో అక్టోబర్ 16తో మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోపు షమి పూర్తి ఫిట్నెస్ సాధించేలా కనిపిస్తున్నాడు.