పాకిస్థాన్ - భారత్ వైర్యం ఇప్పటిది కాదు. ఎన్నో దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఏ విషయంలోనైనా అవకాశం కుదిరినప్పుడల్లా మనోళ్లు వారితో, వారు మనోళ్లతో పోటీ పడుతూ గొడవపడూతూనే ఉంటారు. ముఖ్యంగా దాయాది దేశమైతే అవకాశం కోసం కాపుకాచి మరీ చురకలంటించేందుకు ప్రయత్నిస్తుంటుది. అలా తాజాగా క్రికెట్ విషయానికొస్తే.. పాకిస్థాన్ అభిమానులు దొరికిందే అవకాశం అంటూ బీసీసీఐపై గ్యాప్ లేకుండా సెటైర్లు వేస్తూ రెచ్చిపోయారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?
టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫ్లడ్ లైట్లు మొరాయించడం వల్ల కాసేపు ఆట నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే స్టేడియం సిబ్బంది తక్షణమే స్పందించడంతో ఫ్లడ్ లైట్స్ సమస్య తీరి మ్యాచ్ కొనసాగింది. ఈ సంఘటన జరిగిన ఒక్క రోజు ముందే.. పాకిస్థాన్ గడాఫీ వేదిక జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర.. బంతి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. పైగా త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక కూడా ఇదే.

ఈ గాయం.. నాసిరకమైన ఫ్లడ్ లైట్ల కారణంగా, సరిగ్గా కనిపించక జరిగిందని భారత క్రికెట్ అభిమానులు తీవ్రంగా ఆరోపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఏర్పాటు చేసిన స్టేడియంలో ఆటగాళ్ల భద్రత విషయమై పీసీబీ సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని ఏకీపారేశారు. ఏర్పాట్లు చేయలేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను దుబాయ్కు మార్చేయాలని డిమాండ్ చేశారు.
అలా భారత క్రికెట్ ఫ్యాన్స్ ఫ్లడ్ లైట్ల విషయంలో విమర్శించిన అనంతరం.. కటక్ స్టేడియంలో ఫ్లడలైట్ల సమస్య ఏర్పడింది. దీంతో దొరికిందే అవకాశం అన్నట్టుగా పాక్ క్రికెట్ అభిమానులు బీసీసీఐపై రెచ్చిపోతున్నారు. మీకు అవసరమైతే పాకిస్థాన్ లేదా చైనా ఫ్లడ్ లైట్స్ ను సరఫరా చేస్తుంది.. అంటూ విమర్శలు చేస్తున్నారు. మమ్మల్ని నిందించే ముందు మీ సంగతి చూసుకోండి అని అంటున్నారు.