హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విటర్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీచర్స్ డే సందర్భంగా తనను ప్రభావితం చేసిన క్రికెటర్ల లిస్టుతో ఉన్న ఫోటోను పోస్టు చేసి శుభాకాంక్షలు తెలిపాడు. కోహ్లీ పోస్టు చేసిన ఫోటోలు భారత్తో పాటు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి.
అందులో పాకిస్తాన్ ఆటగాళ్లు ఇంజమామ్ ఉల్ హక్, జావేద్ మియాందాద్, ఇమ్రాన్ ఖాన్ పేర్లుకూడా ఉన్నాయి. పాక్ ఆటగాళ్లను సైతం గురువులుగా గౌరవించడంతో పాకిస్తాన్ అభిమానులు విరాట్ కోహ్లీపై పొగడ్తల వర్షం కురిపించారు. పాక్ ఆటగాళ్లను గౌరవించినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు.

అయితే పాకిస్థాన్కు చెందిన అభిమాని ఇక్కడే తన పైత్యాన్ని ప్రదర్శించాడు. కోహ్లీ ట్వీట్కు రిప్లై ఇస్తూ 'మీరు ఏమీ అనుకోకుండా ఈపోస్టు పెట్టిన జెంటిల్మెన్ పేరు చెబుతారా' అంటూ కోహ్లీ ఎవరో తెలియదన్నట్లుగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు.
'క్రికెట్ ప్రపంచంలో అతడు ఓ లెజెండ్. కోహ్లీ ఎవరో తెలియదని అంటున్నావు. కోహ్లీ గురించి నీకు తెలియకపోతే, అసలు క్రికెట్కే అర్ధం తెలియదన్నమాట' అని ఓ అభిమాని మండిపడింది. ఇదే ట్వీట్కు పాక్కు చెందిన మరో అభిమాని కూడా స్పందించాడు. 'అతని పేరు విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ జట్టుకు నాయకుడు, ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్మెన్. అతని వెనుక ఉన్నవి ప్రఖ్యాత క్రికెటర్ల పేర్లు' అంటూ బదులిచ్చాడు.
ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ చేసిన ఈ ట్వీట్ భారత్లో కూడా చర్చనీయాంశమైంది. కోహ్లీ పోస్టు చేసిన ఫోటోలో మాజీ దిగ్గజాలైన సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే పేర్లు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అనిల్ కుంబ్లేతో విభేదాల వల్ల అతని పేరు కావాలనే పెట్టి ఉండడని భావించినా.. గవాస్కర్ పేరు కనిపించకపోవడం విస్మయం కలిగిస్తోంది.