
హైదరాబాద్: 19 ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. భార్య, తల్లితో కలిసి ముంబైలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 37 ఏళ్ల యువీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
యువరాజ్ రిటైర్మెంట్ నిర్ణయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం తమదైన శైలిలో శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్లో యువరాజ్ సింగ్తో తన తొలి పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు.
అక్తర్ మాట్లాడుతూ "రాక్ స్టార్, మ్యాచ్ విన్నర్, గ్రేట్ జూనియర్. నాకు మంచి స్నేహితుడైన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. యువీతో ఆడిన తొలి మ్యాచ్ నాకు ఇప్పటికీ గుర్తే. 2003 సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో యువరాజ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు" అని అన్నాడు.
"అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత అతడితో మాట్లాడాను. గేమ్పై అతడికి ఉన్న నాలెజ్డ్ విషయంలో నేను చాలా సంతృప్తి చెందాను. యువరాజ్ సింగ్ లాంటి అద్భుతమైన బ్యాట్స్మన్ భారత్ నుంచి ఇంతవరకు రాలేదని భావిస్తాను. అతనో అద్భుతమైన ప్లేయర్" అని షోయబ్ అక్తర్ తెలిపాడు.
యువీ రిటైర్మెంట్పై పాకిస్థాన్కు చెందిన షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిది, వాహబ్ రియాజ్, అహ్మద్ షెహజాద్లు ట్విట్టర్లో స్పందించారు. అఫ్రిది తన ట్విట్టర్లో "నీ అద్భుతమైన కెరీర్కు అభినందనలు. నువ్వొక అద్భుతమైన బ్యాట్స్మన్వే కాదు... అద్భుతమైన ఫీల్డర్వి కూడా. నీ పోరాడేతత్వం అందరికీ ఆదర్శనీయం. ఆల్ ది బెస్ట్" అని ట్వీట్ చేశాడు.