హైదరాబాద్: వెస్టిండీస్లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో పాకిస్తాన్ క్రికెటర్ సొహైల్ తన్వీర్ అద్భుత ప్రదర్శన చేశాడు. గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడుతున్న తన్వీర్ తన బౌలింగ్ ద్వారా జట్టుకు విజయాన్ని అందించాడు.
లీగ్లో భాగంగా మంగళవారం బార్బడోస్ ట్రైడెంట్స్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన తన్వీర్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అంతేకాదు తన్వీర్ వేసిన నాలుగు ఓవర్లలో ఒక వైడు బాల్ ఉండటం విశేషం. ఒక ఓవర్ అయితే మెయిడిన్ అయింది.

ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అనంతరం 159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్ జట్టు తన్వీర్ బౌలింగ్ దెబ్బకు 13.4 ఓవర్లలో 59 పరుగులు చేసి ఆలౌటైంది.
బార్బడోస్ జట్టులో కేవలం ముగ్గురు బ్యాట్స్మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. దీంతో 99 పరుగుల తేడాతో బార్బడోస్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేసిన తన్వీర్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కూడా తన్వీర్ నెలకొల్పిన రికార్డుని ఇప్పటికీ ఎవరూ అధిగమించలేదు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన తన్వీర్ 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. జైపూర్లో 2008, మే 4న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అతడు ఈ ఘనత సాధించాడు.