పాకిస్థాన్ ఆల్రౌండర్ ఇమాద్ వసీమ్ చిక్కుల్లో పడ్డాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా ఇమాద్ సిగిరెట్ తాగాడు. డ్రెస్సింగ్ రూమ్లో అతడు చేసిన ఈ నిర్వాకం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున పీఎస్ఎల్ బరిలోకి దిగిన ఇమాద్ వసీప్ టైటిల్ తుదిపోరులో సంచలన ప్రదర్శన చేశాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
కానీ స్మోకింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో ప్రశంసలకు బదులుగా విమర్శలు అందుకుంటున్నాడు. దీని గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంకా స్పందించలేదు. అతడిపై పాక్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 35 ఏళ్ల ఇమాద్ వసీమ్ పాకిస్థాన్ జట్టుకు దూరమై దాదాపు ఏడాది అవుతుంది. జట్టులో చోటు కోల్పోయిన అతడు టీ20 లీగుల్లో ఆడుతున్నాడు.

35 ఏళ్ల ఇమాద్ పాక్ తరఫున 55 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. 2015లో అరంగేట్రం చేశాడు. ఈ ఆల్రౌండర్ వన్డేల్లో 42 సగటుతో 986 పరుగులు చేశాడు. 44 వికెట్లు పడగొట్టాడు. టీ20 ఫార్మాట్లో 486 పరుగులు, 65 వికెట్లు తీశాడు. ఇక పీఎస్ఎల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఇస్లామాబాద్ యునైటెడ్ ఛాంపియన్గా నిలిచింది. ముల్తాన్ సుల్తాన్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇస్లామాబాద్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. రెండు వికెట్ల తేడాతో గెలిచి ఇస్లామాబాద్ ముచ్చటగా మూడోసారి టైటిల్ను అందుకుంది. మరోవైపు పాయింట్ల పట్టికలో టాపర్గా నిలిచిన ముల్తాన్ సుల్తాన్స్కు నిరాశే మిగిలింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 159 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ (57; 40 బంతుల్లో) టాప్ స్కోరర్. ఇమాద్ వసీమ్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో ఇస్లామాబాద్ యునైటెడ్ 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మార్టిన్ గప్తిల్ (50; 32 బంతుల్లో), అజామ్ ఖాన్ (30; 22 బంతుల్లో), నసీమ్ షా (17; 9 బంతుల్లో), ఇమాద్ వసీమ్ (19*; 17 బంతుల్లో) రాణించారు.