హైదరాబాద్: 'నాన్న.. నన్ను కాల్చేశారు' ఇది 15 ఏళ్ల బాలుడి చివరి మాటలు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాక్ క్రికెట్ జట్టు విజేతగా నిలిచిన సందర్భంగా అభిమానులు చేసుకున్న సంబరాలు ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్పై పాక్ 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ విజయంతో పాకిస్థాన్లో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. సంబరాలు వెల్లువెత్తాయి. భారత్ను పాక్ ఓడించిందన్న సంతోషంలో కరాచీలో రోడ్లమీదకు వచ్చిన కొందరు క్రికెట్ అభిమానులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 ఏళ్ల సయ్యద్ హుస్సేన్ రజా జైదీ అనే బాలుడు మృతి చెందాడు.
పాక్ గెలుపు సంబరాల్లో భాగంగా గాలిలో కాల్పులు జరపడంతో ఇంటి పెద్ద కొడుకైన హుస్సైన్ జైదీ శరీరంలోకి తూటా దూసుకెళ్లింది. 'నాన్న.. నన్ను కాల్చేశారు' అంటూ హుస్సైన్ అక్కడికక్కడే నేలకూలాడు. అనంతరం బాలుడిని కరాచీలోని జిన్నా పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్కు వెంటనే తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు తుది శ్వాస విడిచాడు. సంబరాల్లో భాగంగా గాల్లోకి జరిపిన కాల్పుల కారణంగా ఎంతోమంది గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఘన విజయం సాధించిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. కరాచీలో అడుగుపెట్టిన పాకిస్థాన్కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.