టీ20 ప్రపంచకప్ వాయిదా?:
గురువారం అన్ని దేశాల బోర్డు సభ్యులతో నిర్వహించనున్న టెలీ కాన్ఫరెన్స్ అనంతరం టీ20 ప్రపంచకప్ వాయిదాను ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ప్రపంచకప్ వాయిదా పడనుండటంతో.. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నిర్వహించుకోవడానికి మార్గం సుగుమం అవుతుంది. ఆ విండోలో ఐపీఎల్ 2020 సీజన్ని నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ఆశిస్తోంది. ఇందుకోసం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక క్రికెట్ బోర్డుల అనుమతి కూడా తీసుకున్నడట. ఇక ఐపీఎల్ జరగడం లాంఛనమే అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పాక్ కడుపు మంట:
టీ20 ప్రపంచకప్ వాయిదా పడిన దానికంటే.. ఐపీఎల్ 2020 జరిగే అవకాశం ఉండటాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జీర్ణించుకోలేకపోతుంది. తాజాగా పీసీబీ అధికారి ఒకరు బీసీసీఐపై తమ కడుపు మంటను వెళ్లగక్కాడు. భారత్లో జరిగే ఐపీఎల్ కోసం టీ20 ప్రపంచకప్ను ఐసీసీ వాయిదా వేయాలనుకోవడాన్ని తాము సమర్థించబోమని స్పష్టం చేసారు. టీ20 ప్రపంచకప్కు ఇంకా సమయం ఉందని, ఇది మే నెలనే.. ఇంకా కనీసం రెండు నెలలైన వేచిచూడాలని ఐసీసీని కోరారు.
ప్రపంచకప్కు ఇంకా సమయం ఉంది:
'టీ20 ప్రపంచకప్కు ఇంకా సమయం ఉంది. ఇది మే నెలనే కాబట్టి ఇంకా కనీసం రెండు నెలలైన వేచిచూడాలి. రెండు నెలల తర్వాత కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. క్రికెట్ క్యాలెండర్ ప్రకారం పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఇంగ్లండ్లో సిరీస్ ఆడే అవకాశం ఉంది' అని పీసీబీకి చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు.
రీ షెడ్యూల్ చేయడానికి ఒప్పుకోం:
'ఐపీఎల్ అనేది ఓ దేశీయ టోర్నీ. దానిని బీసీసీఐ నిర్వహిస్తోంది కానీ ఐసీసీ కాదు. టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ సమయాన్ని ఐపీఎల్కు కేటాయిస్తామంటే మేం వ్యతిరేకిస్తాం. ఐసీసీ ఈవెంట్స్, ద్వైపాక్షిక సిరీస్లకు మాత్రమే మేము ప్రాధాన్యత ఇస్తాం. వాటి స్థానాల్లో దేశీయ టోర్నీలకు మేం మద్దతివ్వం. ఐపీఎల్ కోసం టీ20 ప్రపంచకప్ రీ షెడ్యూల్ చేయడానికి ఒప్పుకోం' అంటూ పీసీబీ అధికారి స్పష్టం చేసారు.