హైదరాబాద్: క్రీజులో దూకుడుగా ఆడుతున్న బ్యాట్స్మెన్ను కట్టడి చేసేందుకు బౌలర్లు వేసే ప్రధాన అస్త్రం యార్కర్. బ్యాట్స్మెన్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, యార్కర్గా వేసిన బంతి క్షణాల వ్యవధిలో వికెట్లని నేలకూల్చుతుంది. దీంతో బౌలర్ యార్కర్ వేయగానే క్రికెట్లో భీకరమైన హిట్టర్ కూడా భయపడతాడు.
తాజాగా వరల్డ్ ఎలెవన్ జట్టుతో జరుగుతున్న మూడు టీ20 సిరీస్లో పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ విసిరిన యార్కర్ బంతికి డారెన్ సామి క్రీజులోనే కిందపడిపోయాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా మంగళవారం వరల్డ్ ఎలెవన్ జట్టుతో గడాఫీ స్టేడియం వేదికగా తొలి టీ20 జరిగింది.
ఈ మ్యాచ్లో వరల్డ్ ఎలెవన్ జట్టు విజయానికి చివరి 5 బంతుల్లో 28 పరుగులు అవసరమైన దశలో ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ యార్కర్ బంతిని విసిరాడు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన వరల్డ్ ఎలెవన్ జట్టు బ్యాట్స్మెన్ డారెన్ సామీ.. కాళ్ల కింద పడిన ఈ యార్కర్ని పాదం కదిపి ఆడాలని ప్రయత్నించాడు.
కానీ.. బంతి వేగానికి పట్టుతప్పి క్రీజులోనే పడిపోయాడు. చివరి ఓవర్లో సామిని నియంత్రించేందుకు అద్భుతమైన యార్కర్ని విసిరిన హసన్ అలీని కింద పడిన సామి అభినందించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సామి తీరుపై పాక్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇండిపెండెన్స్ కప్లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్లో తొలి మ్యాచ్ను చేజార్చుకున్న వరల్డ్ ఎలెవన్... రెండో మ్యాచ్లో విజయం సాధించింది. బుధవారం పాకిస్థాన్తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిసీస్ను 1-1తో సమం చేసింది.
పాక్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో మరో బంతి మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఆమ్లా(72 నాటౌట్, 5 ఫోర్లు, 2సిక్స్లు) అజేయ హాఫ్ సెంచరీకి తోడు చివర్లో తిసార పెరీరా(47 నాటౌట్, 5 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (43)తో పాటు బాబర్ అజామ్ (45), షోయబ్ మాలిక్ (39) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. వరల్డ్ ఎలెవన్ బౌలర్లలో బద్రీ, పెరీరా చెరో రెండు వికెట్లు తీశారు.
పాకిస్థాన్ నిర్దేశించిన 175 లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే వరల్డ్ ఎలెవన్ చేధించింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అద్భుత ప్రదర్శన చేసిన తిసార పెరీరాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిర్ణయాత్మక మూడో టీ20 శుక్రవారం లాహోర్ జరగనుంది.