
హైదరాబాద్: విరాట్ కోహ్లీ... మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా పాకిస్థాన్కు చెందిన షాహబాజ్ షరీఫ్ ఖాస్మీ అనే క్రికెట్ అభిమాని కోహ్లీ మా దేశంలో క్రికెట్ ఆడితే చూడాలని ఉందంటూ ప్లకార్డుని ప్రదర్శించాడు.
దాసన్ షణక సారథ్యంలోని శ్రీలంక జట్టు ప్రస్తుతం పాకిస్థాన్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టీ20 సిరీస్లో భాగంగా బుధవారం ఆఖరి మ్యాచ్ లాహోర్లోని గఢాఫీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో షాహబాజ్ షరీఫ్ ఖాస్మీ ప్రదర్శించిన ఓ ఫ్లకార్డు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.
"విరాట్ కోహ్లీ మీరు పాకిస్థాన్లో ఆడితే చూడాలని ఉంది" అని రాసి ఉన్న ప్లకార్డుని పట్టుకుని స్టేడియం మొత్తం కలియదిరిగాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. "విరాట్.. మీరు పాకిస్థాన్కు వచ్చి ఇక్కడ మ్యాచ్ ఆడతారని ఆశిస్తున్నా. నేను మీకు పెద్ద అభిమానిని" అనే కామెంట్తో ఆ ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ను ఇప్పటికే అనేక మంది లైక్ చేయగా... పలువురు నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు.