హైదరాబాద్: గత కొంతకాలంగా వరుస ఓటములతో సొంత ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంక జట్టు తాజాగా ఓ చెత్తరికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఒకే ఏడాదిలో అన్ని ఫార్మట్లలో అత్యధిక ఓటములను మూటగట్టుకున్న జట్టుగా శ్రీలంక జట్టు అరుదైన ఘనత సాధించింది.
ఈ కేలండర్ ఇయర్లో మొత్తం 33 పరాజయాలను శ్రీలంక జట్టు చవిచూడటం విశేషం. ఇందులో 21 వన్డేలు ఉన్నాయి. అంతకముందు ఈ రికార్డు జింబాబ్వేపై ఉండగా, శ్రీలంక దానిని అధిగమించి అగ్రస్ధానంలో నిలిచింది. తాజాగా దుబాయి వేదికగా పాకిస్థాన్తో జరిగిన రెండో టీ20లో లంక ఓటమిపాలైంది.

ఈ ఓటమి పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంకకు వరుసగా 15వ ఓటమి. ఈ మ్యాచ్లో ఫహీమ్ అష్రాఫ్ (3/16) హ్యాట్రిక్ తీయడంతో రెండో టీ20లో పాకిస్థాన్ రెండు వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది.
ఒకానొక దశలో 105/1తో పటిష్టంగా ఉన్న శ్రీలంక అనూహ్యంగా కుప్పకూలింది. కేవలం 18 పరుగుల వ్యవధిలో చివరి 9 వికెట్లు చేజార్చుకుంది. 19వ ఓవర్లో ఉదాన (6), ఉదవతె (0), షనక (1)లను వరుస బంతుల్లో అవుట్ చేసిన అష్రఫ్ పాక్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు.
125 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా పాక్ సరికొత్త రికార్డుని సృష్టించింది. టీ20 చరిత్రలో వరుసగా ఐదు ద్వైపాక్షిక సిరీస్లను గెలుచుకున్న జట్టుగా పాకిస్థాన్ రికార్డులకెక్కింది. దీనికి ముందు జరిగిన వన్డే సిరీస్ను 5-0 తేడాతో పాక్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.