
ప్రపచంకప్లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో పరాజయం తర్వాత పాకిస్తాన్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. పాక్ ఆటగాళ్లపై ఆ దేశ అభిమానులు విరుచుకుపడ్డారు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్పై అయితే మండిపడ్డారు. సోషల్మీడియా వేదికగానే కాకుండా.. బాహాటంగానే అసభ్య పదజాలంతో తిట్టారు. పాక్ ఆటగాళ్లకు పిజ్జాలు, బర్గర్లు తినడం తప్పా ఆడటం రాదని కూడా ట్రోల్ చేశారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. అప్పుడు తిట్టిన అభిమానులే ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాదు తాజా విజయంతో పాక్ అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. మైదానంలోనే సంబరాలు చేసుకున్నారు. కొందరైతే లండన్ వీధుల్లో గెలుపు సంబరాలు చేసుకున్నారు. మరికొందరు పాక్ ఆటగాళ్లతో సెల్ఫీలు దిగారు. మ్యాచ్ అనంతరం అభిమానులకు సర్ఫరాజ్ అహ్మద్ ఆటోగ్రాఫ్ లు కూడా ఇచ్చాడు. అభిమానులు గెలుపు ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. హరిస్ సొహైల్ (59 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్స్లు), బాబర్ ఆజమ్ (80 బంతుల్లో 69; 7 ఫోర్లు)లు అర్ధ సెంచరీలు చేశారు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ డుప్లెసిస్ (79 బంతుల్లో 63; 5 ఫోర్లు), డికాక్ (60 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు.
ప్రపచంకప్లో 6 మ్యాచ్లు ఆడిన పాక్ రెండు విజయాలు సాధించింది. మూడు ఓడిపోగా.. ఒకటి వర్షంతో రద్దవ్వడంతో 5 పాయింట్లతో 7 స్థానంలో నిలిచింది. సెమీస్ చేరాలంటే మిగతా అన్నిమ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి. పాక్ తన తదుపరి మ్యాచ్లలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అప్గానిస్తాన్లతో ఆడనుంది. ఈ నెల 26న న్యూజిలాండ్తో పాక్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే పాక్ సెమీస్ చేరే అవకాశాలు మెరుగవుతాయి.