ముల్తాన్ వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పరుగుల వరద పారిస్తోంది. హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ, జో రూట్ డబుల్ సెంచరీతో విజృంభించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ 375 బంతుల్లో 262 పరుగులు చేశాడు. 17 ఫోర్లు బాదాడు. హ్యారీ బ్రూక్ 322 బంతుల్లో 317 పరుగులు సాధించాడు. 29 ఫోర్లు, మూడు సిక్సర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
జో రూట్-హ్యారీ బ్రూక్ నాలుగో వికెట్కు 454 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీ కలిసి 522 బంతులు ఎదుర్కొన్నారు.అయితే ఈ క్రమంలో రూట్-బ్రూక్ టెస్టు క్రికెట్లో నాలుగో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసిన జోడీగా రికార్డులకెక్కింది. ఈ జాబితాలో శ్రీలంక జోడీలు.. కుమార సంగక్కర-మహేలా జయవర్ధనె (624 పరుగులు, సౌతాఫ్రికాపై-2006), జయసూర్య-మహనామా (576 పరుగులు, భారత్పై-1997) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

మూడో స్థానంలో న్యూజిలాండ్కు చెందిన మార్టిన్ క్రోవ్-ఆండ్రూ జోన్స్ (467 పరుగులు, శ్రీలంకపై-1999) ఉన్నారు. ఇక ట్రిపుల్ సెంచరీ సాధించిన హ్యారీ బ్రూక్ పలు వ్యక్తిగత రికార్డులు నమోదుచేశాడు. ఇంగ్లండ్ తరఫున ట్రిపుల్ సెంచరీ బాదిన ఆరో ప్లేయర్గా రికార్డు సాధించాడు. అతని కంటే ముందు లియోనార్డ్ హట్టన్ (364), వాలీ హమ్మండ్ (336*), గ్రాహమ్ గూచ్ (333), ఆండీ సాందమ్ (325), జాన్ ఎడ్రిచ్ (310*) ఈ ఘనత అందుకున్నారు.
ఇక బంతుల పరంగా ట్రిపుల్ సెంచరీ అత్యంత వేగంగా సాధించిన రెండో ప్లేయర్గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. 310 బంతుల్లో బ్రూక్ 300 మార్క్ను అందుకున్నాడు. ఈ జాబితాలో టాప్-4లో రెండు స్థానాల్లో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. 2008లో సౌతాఫ్రికాపై సెహ్వాగ్ 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ బాదాడు. మూడో స్థానంలో మాథ్యూ హేడెన్ (362 బంతుల్లో, జింబాబ్వేపై-2003), నాలుగో స్థానంలో సెహ్వాగ్ (364 బంతుల్లో, పాకిస్థాన్పై- 2004) ఉన్నారు.