
హైదరాబాద్: ఓ వైపు రాబోయే వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టే విజేతగా నిలుస్తుందని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ అంటుంటే.. మరోవైపు ఇంగ్లాండ్ కు ఇది పరీక్షా సమయం. ఇలాంటప్పుడే జట్టు బలాన్ని నిరూపించుకోవాలి. పాకిస్థాన్ చేతిలో సొంతగడ్డపై ఇటీవల తొలి టెస్టులో ఓడిన ఇంగ్లాండ్ జట్టు.. తీవ్ర ఒత్తిడి మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టులో బరిలోకి దిగనుంది.
లార్డ్స్ వేదికగా జరిగిన ఆ టెస్టులో ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. దీంతో పాక్ 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. కొద్దిరోజులుగా ఇంగ్లాండ్ వన్డేల్లో మంచి ఫలితాలు రాబడుతున్నా.. టెస్టుల్లో అనూహ్య పరాజయాలు ఎదుర్కొంటుంది. ఇంగ్లాండ్ జట్టు.. చివరిగా ఆడిన 8 టెస్టు మ్యాచ్ల్లోనూ గెలిచింది రెండింటిలో మాత్రమే.
దీనికి తోడు మొదటి టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన ఆల్రౌండర్ బెన్స్టోక్స్ రెండో టెస్టుకి దూరమవడం ఆ జట్టుని మరింత ఒత్తిడిలోకి నెడుతోంది. మరోవైపు ఈ రెండో టెస్టులో కూడా గెలిచి సిరీస్ని 2-0 కైవసం చేసుకోవాలని పాకిస్థాన్ ఉవ్విళ్లూరుతోంది.
'ఇంగ్లాండ్ జట్టు సత్తా నిరూపించుకోవాల్సిన సమయమిదే. బెన్స్టోక్స్ రెండో టెస్టుకి అందుబాటులో ఉండింటే బాగుండేది. అతను మా జట్టులో బెస్ట్ క్రికెటర్. తుది జట్టులో ఉండింటే.. బౌలింగ్, బ్యాటింగ్ రూపంలో జట్టుకి అదనపు ప్రయోజనాలు చేకూరేవి. జట్టు వరుసగా విజయాలు సాధిస్తుంటే.. సమీక్ష అవసరం ఉండేది కాదు. కానీ.. పరాజయాలు ఎదురవుతున్న వేళ.. తప్పకుండా వెనుదిరిగి చూసుకోవాల్సిందే' అని ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ వెల్లడించాడు.