టీ20 వరల్డ్ కప్-2024లో పాకిస్థాన్ ఎట్టకేలకు పాయింట్ల ఖాతా తెరిచింది. తొలి రెండు మ్యాచ్ల్లో అమెరికా, భారత్ చేతిలో ఓడిన పాక్ మంగళవారం గెలుపు రుచి చూసింది. న్యూయార్క్ వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలర్ల పోరాటాన్ని ఈ సారి వృథా చేయకుండా బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడారు.
మొదట కెనడా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 106 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరోన్ జోన్స్ (52; 44 బంతుల్లో, 4 ఫోర్లు) టాప్ స్కోరర్. మహ్మద్ అమీర్ (2/13), హారిస్ రవూఫ్ (2/26) చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం పాకిస్థాన్ 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్ రిజ్వాన్ (53 నాటౌట్; 53 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ అర్ధశతకంతో సత్తాచాటాడు. బాబర్ అజామ్ (33; 33 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు.

కాగా, హాఫ్సెంచరీ సాధించిన మహ్మద్ రిజ్వాన్ అరుదైన రికార్డుతో పాటు చెత్త రికార్డు నమోదు చేశాడు. టీ20ల్లో 50+ స్కోరు అత్యధిక చేసిన ఓపెనర్గా రోహిత్ శర్మ సరసన రిజ్వాన్ నిలిచాడు. రోహిత్ 118 ఇన్నింగ్స్ల్లో 30 అర్ధశతకాలు సాధించగా రిజ్వాన్ 71 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత అందుకున్నాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాతి స్థానాల్లో బాబర్ అజామ్ (28 హాఫ్ సెంచరీలు; 84 ఇన్నింగ్స్), డేవిడ్ వార్నర్ (27 హాఫ్ సెంచరీలు; 98 ఇన్నింగ్స్) ఉన్నారు.
ఇక టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ తరఫున అత్యధిక సార్లు అర్ధశతకాలు సాధించిన ప్లేయర్గా బాబర్ అజామ్ సరసన రిజ్వాన్ చేరాడు. ఇద్దరూ అయిదు హాఫ్సెంచరీలు సాధించాడు. అయితే రిజ్వాన్ ఓ కోరుకోని రికార్డు కూడా సాధించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత నిదానంగా అర్ధశతకం చేసిన ఆటగాడిగా రిజ్వాన్ రికార్డులకెక్కాడు. కెనడాతో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లో 50 మార్క్ను అందుకున్నాడు.
అంతకుముందు ఈ చెత్త రికార్డు డేవిడ్ మిల్లర్ పేరిట ఉంది. ఇటీవల నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో మిల్లర్ 50 బంతుల్లో హాఫ్సెంచరీ సాధించాడు. కొన్నిరోజుల వ్యవధిలోనే కోరుకోని రికార్డు మిల్లర్ పోగొట్టుకున్నాడని, రిజ్వాన్కు మిల్లర్ థ్యాంక్స్ చెప్పాలని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, టీ20 ప్రపంచకప్లో 100 కంటే తక్కువ స్ట్రైక్రేటుతో హాఫ్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు రిజ్వాన్.