

హైదరాబాద్: ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న పాక్ పేసర్ మహ్మద్ ఆమీర్పై వేటు పడింది. అక్టోబర్ నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం పాకిస్థాన్ జట్టుని సెలక్టర్లు గురువారం ప్రకటించారు.
ఐదేళ్ల మ్యాచ్ ఫిక్సింగ్ నిషేధం తర్వాత మళ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టిన 26 ఏళ్ల పేసర్ ఆమీర్ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో ఆసీస్తో టెస్టు సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
మొత్తం 17 మంది సభ్యుల్లో లెగ్ స్పిన్నర్ యాసిర్ షాతో పాటు 19 ఏళ్ల షాదాబ్ ఖాన్, 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ బిలాల్ ఆసిఫ్కు చోటు కల్పించారు. యూఏఈలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేశామని చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హాక్ అన్నారు.
యూఏఈ వేదికగా 2014లో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 2-0తో పాక్ చేజిక్కించుకోవడంలో యాసిర్ షా కీలకపాత్ర పోషించాడు. ఆ సిరిస్లో యాసిర్ షా 12 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2009 నుంచి పాక్ తన హోం మ్యాచ్లను యూఏఈ వేదికగా ఆడుతోన్న సంగతి తెలిసిందే.
రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా తొలి టెస్టు దుబాయి వేదికగా అక్టోబర్ 7 నుంచి ప్రారంభం అవుతుండగా, రెండో టెస్టు అక్టోబర్ 16 నుంచి అబుదాబి వేదికగా ప్రారంభం కానుంది. టెస్టు సిరిస్ అనంతరం ఇరు జట్లు మూడు టీ20ల సిరిస్ ఆడనున్నాయి.
జట్టు వివరాలు:
సర్ఫరాజ్ ఖాన్ (కెప్టెన్), అజర్ అలీ, ఫక్హర్, ఇమామ్, బాబర్, ఆసద్, హారిస్, ఉస్మాన్, యాసిర్ షా, షాదాబ్ ఖాన్, బిలాల్ ఆసిఫ్, అబ్బాస్, హసన్ అలీ, రియాజ్, అష్రాఫ్, మిర్ హమ్జా, రిజ్వాన్.