
హైదరాబాద్: దుబాయి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు పైచేయి సాధించింది. ఆదివారం ఆరంభమైన ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 482 పరుగులకి ఆలౌటవగా.. మంగళవారం తొలి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టు.. పాక్ బౌలర్లు బైలాల్ ఆసిఫ్ (6/36), మహ్మద్ అబ్బాస్ (4/29) ధాటికి 202 పరుగులకే ఆలౌటైంది.
దీంతో పాకిస్థాన్ జట్టుకి 280 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ టెస్టు మ్యాచ్తో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన బిలాల్ తన తొలి ఇన్నింగ్స్లోనే 6 వికెట్లు తీసుకోవడం విశేషం. పేస్ బౌలర్ మహ్మద్ అబ్బాస్ నాలుగు వికెట్లతో రాణించాడు. పాక్ తరఫున తొలి టెస్ట్లోనే మూడో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన బౌలర్గా బిలాల్ అరుదైన ఘనత సాధించాడు.
ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (85), అరోన్ ఫించ్ (62) హాఫ్ సెంచరీలో రాణించారు. తొలి వికెట్కి 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఓపెనింగ్ జోడీ 52వ ఓవర్లో విడిపోగా ఆ తర్వాత ఏ దశలోనూ ఆస్ట్రేలియా కోలుకోలేక పోయింది. 142 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయిన ఆసీస్ ఆ తర్వాత 60 పరుగుల తేడాలో పది వికెట్లు చేజార్చుకుంది.
పాక్ బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియాకు చెందిన ఏడుగురు బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. తొలిరోజు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టులో మహ్మద్ హఫీజ్ (126), హరీశ్ సోహైల్ (110) సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పాక్కు 280 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పాక్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.