
దుబాయ్: ఆసియా కప్ 2022 సూపర్ 4లో భాగంగా షార్జా స్టేడియంలో బుధవారం రాత్రి పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్- అసలు సిసలు మజా ఇచ్చింది. ఫైనల్స్కు చేరుకోవాలంటే గెలిచిన తీరాల్సిన ఈ లో స్కోర్ మ్యాచ్లో రెండు జట్లు హోరాహోరిగా పోరాడాయి. చివరి బంతి వరకూ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా కనిపించింది. చివరి ఆరు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో పాక్ బ్యాటర్ నసీం షా సిక్సర్ల సిక్సర్ల మోత మోగించాడు. తొలి రెండు బంతుల్లోనే మ్యాచ్ను ఫినిష్ చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. ఫైనల్స్కు చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో ఆఫ్ఘన్ 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి ఎవ్వరూ కుదురుగా క్రీజ్లో నిల్చోలేకపోయారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇబ్రహం జడ్రాన్ ఒక్కడే టాప్ స్కోరర్ 37 బంతుల్లో రెండు సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ఓపెనర్ హజ్రతుల్లా జజయ్-21, రహ్మనుల్లా గుర్బాజ్-17, కరీం జనత్-15, నజీబుల్లా జడ్రాన్-10, కేప్టెన్ మహ్మద్ నబీ-0, అజ్ముతుల్లా ఒమర్జయ్-10, రషీద్ ఖాన్-18 పరుగులు చేశారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ కూడా ప్రారంభంలో పరుగులు చేయడానికి ఇబ్బందులుపడింది. కేప్టెన్- ఓపెనర్ బాబర్ ఆజమ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్-20, ఇఫ్తికర్ అహ్మద్-30, షాదబ్ ఖాన్-36 పరుగులు చేయగలిగారు. చివర్లో నసీం షా తొమ్మిది బంతుల్లో చివరి ఓవర్లో రెండు సిక్సర్లు బాదడం క్రికెట్ ప్రేమికులను అలరించింది.
నసీం షా బాదిన ఈ రెండు సిక్సర్లు అతణ్ని ఓవర్ నైట్ హీరోను చేశాయి. టీ20 ఇంటర్నేషనల్స్లో బెస్ట్ ఫినిషర్ అనే గుర్తింపును ఇచ్చాయి. ఇదే విషయాన్ని కేప్టెన్ బాబర్ ఆజమ్ ప్రస్తావించాడు. నసీం కొట్టిన ఆ రెండు షాట్లు తనకు లెజెండరీ బ్యాటర్ జావెద్ మియాందాద్ను గుర్తు చేశాయని వ్యాఖ్యానించాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా అతను విలేకరులతో మాట్లాడాడు. లోయెస్ట్ స్కోరే అయినప్పటికీ.. దీన్ని ఛేదించడానికి శ్రమించాల్సి వచ్చిందని, డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం వేడెక్కిందని వ్యాఖ్యానించాడు.
బౌలింగ్లో సత్తా చాటామని, బలమైన బ్యాటింగ్ లైనప్ గల ప్రత్యర్థిని 129 పరుగులకే కట్టడి చేశామని పేర్కొన్నాడు. 130 పరుగుల లోపే కట్టడి చేయడం జట్టు బౌలింగ్ సత్తాను చాటిందని వ్యాఖ్యానించాడు. లో స్కోర్ మ్యాచ్ అయిప్పటికీ.. చివరి ఓవర్ వరకు సాగడం టెన్షన్ పెట్టిందని వ్యాఖ్యానించాడు. గతంలో ఇదే షార్జాలో జావెద్ మియాందాద్ భారత్పై చివరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్ను గెలిపించిన ఉదంతం గుర్తుకొచ్చిందని పేర్కొన్నాడు.