పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిదిని తన మామ, దిగ్గజ పాక్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ఓ కార్యక్రమంలో అవమానించాడు. తన అల్లుడు షాహిన్ పొరపాటును పాకిస్థాన్ టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యాడని అన్నాడు. ఈ వ్యాఖ్యలను షాహిద్ అఫ్రిది వ్యంగ్యంగా అనడంతో కార్యక్రమంలో ఉన్న అందరూ నవ్వారు. అయితే తన అల్లుడు షాహిన్ స్థానంలో వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్కు అవకాశం ఇవ్వాల్సిందని అతడు అభిప్రాయపడ్డాడు.
ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ అనంతరం పాకిస్థాన్ కొత్త కెప్టెన్లను నియమించిన సంగతి తెలిసిందే. మెగాటోర్నీలో జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ బాబర్ అజామ్ కెప్టెన్సీ నుంచి తప్పించుకున్నాడు. సారథిగా మూడు ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు, కానీ బ్యాటర్గా కొనసాగుతానని చెప్పాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సెలక్టర్లు కొత్త కెప్టెన్లను నియమించారు. టెస్టులకు సారథిగా షాన్ మసూద్, టీ20లకు కెప్టెన్ షాహిన్ అఫ్రిదిని ప్రకటించారు.

అయితే ఓ కార్యక్రమానికి షాహిద్ అఫ్రిదితో పాటు హరీస్ రవూఫ్, సర్ఫరాజ్ అహ్మద్ హాజరయ్యారు. కాగా, అఫ్రిది ప్రసంగిస్తూ రిజ్వాన్ను కొనియాడాడు. ''రిజ్వాన్ కఠోర శ్రమ, ఏకాగ్రత గొప్పగా ఉంటుంది. రిజ్వాన్లో నచ్చే విషయం ఏంటంటే.. అతడు ఆటపై మాత్రమే ఫోకస్ పెడతాడు. ఇతర విషయాలను పట్టించుకోడు. అతడు ఓ రియల్ ఫైటర్. పాకిస్థాన్ టీ20 కెప్టెన్గా రిజ్వాన్ను చూడాలనుకున్నాను. కానీ పొరపాటున షాహిన్ అఫ్రిది అయ్యాడు'' అని అన్నాడు. ఈ వ్యాఖ్యాలతో కార్యక్రమంలో పాల్గొన్న అందరూ నవ్వారు.
కాగా, ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇప్పటికీ టెస్టు సిరీస్ను 0-2తో చేజార్చుకుంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఆఖరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 03న ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 360 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ పర్యటన అనంతరం పాకిస్థాన్ న్యూజిలాండ్తో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో పాక్ జట్టును షాహిన్ అఫ్రిది నడిపించనున్నాడు.