హైదరాబాద్: 2020లో జరిగే పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఎడిషన్ను పూర్తిగా పాకిస్థాన్లో నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు బుధవారం పీఎస్ఎల్-2020 సీజన్ షెడ్యూల్ని విడుదల చేసింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 22 వరకు జరిగే ఈ సీజన్కు పాక్ వ్యాప్తంగా నాలుగు వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి.
పీఎస్ఎల్-2020 సీజన్లో మొత్తం 34 మ్యాచ్లు జరగనున్నాయి. గత పీఎస్ఎల్ ఎడిషన్కు సంబంధించిన లీగ్ షెడ్యూల్ను యుఏఈలో నిర్వహించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చివరి ఎనిమిది మ్యాచ్లను మాత్రం పాక్లో ఆడించింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా చాలా మంది విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు.
పీసీబీ బుధవారం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం కరాచీలోని నేషనల్ స్టేడియం 9 మ్యాచ్లకు ఆతిథ్యమిస్తుండగా... లాహోర్లోని గడాఫీ స్టేడియం అత్యధికంగా 14 మ్యాచ్లకు ఆతిథ్యమిస్తుంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో ముల్తాన్ సుల్తాన్స్ 3 మ్యాచ్లు ఆడుతుండగా... పిండి క్రికెట్ స్టేడియం 8 మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది.
ఈ ఎడిషన్ ఆరంభ మ్యాచ్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్స్ క్వెట్టా గ్లాడియేటర్స్ రెండు సార్లు విజేతగా నిలిచిన ఇస్తామాబాద్ యునైటెడ్ జట్టుతో తలపడనుంది. క్యాలిఫయిర్ మ్యాచ్లకు నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తుండగా... ఎలిమినేటర్స్, ఫైనల్ మ్యాచ్లకు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యమిస్తుంది.
దీనిపై పీసీబీ ఛైర్మన్ ఎసాన్ మణి మాట్లాడుతూ "టెస్ట్ క్రికెట్ను తిరిగి పాకిస్తాన్కు తీసుకువచ్చిన తరువాత, పాకిస్తాన్ సూపర్ లీగ్కు ఆతిథ్యం ఇవ్వడం మరో విజయం. ఇది పాకిస్తాన్ లీగ్ అని నాకు ఎప్పుడూ సందేహం లేదు. మా సొంత ప్రేక్షకుల మధ్య ఈ మ్యాచ్లు ఆడాలి. గత సీజన్ ముగింపులో భాగంగా మేము పాక్ ప్రజలకు మాటిచ్చాం. ఇప్పుడు నాలుగు వేదికల్లో 34 మ్యాచ్ల షెడ్యూల్ని ప్రకటించాం" అని అన్నాడు.
ఈ సీజన్లో 36 మంది విదేశీ ఆటగాళ్లు ఈ మెగా లీగ్లో ఆడనున్నారు. 22 దేశాలకు చెందిన మొత్తం 425 మంది ఆటగాళ్లు ఈ లీగ్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని మణి చెప్పుకొచ్చాడు. ఆప్ఘనిస్థాన్ నుంచి 39 మంది, ఆస్ట్రేలియా నుంచి 12, బంగ్లాదేశ్ నుంచి 23, కెనడా నుంచి 10, ఇంగ్లాండ్ నుంచి 103, హాంకాంగ్ నుంచి 7, ఐర్లాండ్ నుంచి 6, నెదర్లాండ్స్ నుంచి 7, నేపాల్ నుంచి 7, కివీస్ నుంచి 11, ఓమన్ నుంచి 9, సింగపూర్ నుంచి 4, దక్షిణాఫ్రికా నుంచి 27, శ్రీలంక నుంచి 39, యుఏఈ నుంచి 9, యుఎస్ఏ నుంచి 6, వెస్టిండిస్ నుంచి 82, జింబాబ్వే నుంచి 9, బెర్ముడా, కెన్యా, నమీబియా నుంచి తలా ఒకరు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.