
పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు కంటే పాకిస్థాన్ మెరుగైన జట్టు అని పేర్కొన్నాడు. భారత్ మంచి జట్టే కానీ పాకిస్థాన్ అంతా కాదని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే పాకిస్థాన్లో షాహీన్ షా ఆఫ్రిది, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లు ప్రస్తుతం ఉన్నారని పేర్కొన్నాడు. త్వరలో జరగనున్న ఆసియా కప్ గురించి లతీఫ్ మాట్లాడుతూ.. ఆసియా కప్లో ప్రధాన పోటీ భారత్-పాకిస్థాన్ మధ్యే ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్లో పాకిస్థాన్ గెలిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసిన లతీఫ్.. 2021 టీ20 ప్రపంచకప్లో భారత్పై పాకిస్థాన్ పది వికెట్ల తేడాతో గెలుపొందడం వల్ల ఆసియా కప్ ఈజీగా గెలుస్తుందనిపిస్తుందని పేర్కొన్నాడు. ఇకపోతే 2022ఆసియా కప్ ఆగస్టు చివర్లో శ్రీలంకలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. 'టీమిండియా మంచి జట్టు అనడంలో డౌట్ లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు అత్యద్భుతంగా క్రికెట్ ఆడుతుంది. పాకిస్తాన్లో షాహీన్ షా ఆఫ్రిది, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. వారు ప్రస్తుతం ఐసీసీ గుర్తించిన అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. 2021 అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ టైంలో పాకిస్తాన్, భారతదేశం తలపడినప్పుడు.. టీమిండియా విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించి 10వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. అందువల్ల పాకిస్థాన్ ఆసియా కప్ కూడా గెలిచేందుకు అవకాశాలు ఎక్కువయ్యాయి.' అని అతను పేర్కొన్నాడు.
ఇకపోతే టీ20లలో భారత్, పాకిస్తాన్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 7 సార్లు గెలవగా, పాకిస్తాన్ మిగిలిన రెండు మ్యాచ్లలో గెలిచింది. ఇకపోతే అక్టోబర్ 23న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో ఇరు జట్లు లీగ్ దశలో తలపడబోతున్నాయి.