
భారత్ కన్నా మాదే మెరుగైన జట్టు
టోర్నీలో గ్రూప్-2 ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, టీమిండియా తలపడ్డాయి. చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్ ఓడినా కూడా భారత్ కన్నా తమదే మెరుగైన జట్టని రుజువైందన్నాడు షాదాబ్ ఖాన్. 'చిన్నతనం నుంచి మాకు భారత్పై గెలవాలనే ఉంటుంది. కప్పు కొట్టకపోయినా పర్లేదు కానీ.. భారత్పై గెలవాలని అనుకుంటాం. అలాంటి ఒత్తిడి ఉంటుంది. కానీ మ్యాచ్లో వందశాతం శ్రమిస్తే విజయం మాకే దక్కుతుందని మా నమ్మకం. భారత్తో మ్యాచ్లో అదే చేశాం. చివర్లో ఫలితం మారినా మా జట్టే మెరుగైందని స్పష్టంగా కనిపించింది' అన్నాడీ స్టార్ ఆల్రౌండర్.

ఫైనల్లో ఒత్తిడి..
భారత్తో మ్యాచ్కు ముందు ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ప్రస్తుతం ఫైనల్కు ముందు కూడా అలాంటి ఒత్తిడే ఉందని షాదాబ్ అన్నాడు. అలాంటి ఒత్తిడి తమపై కొనసాగుతూనే ఉంటుందని చెప్పాడు. ఇంగ్లండ్ మాజీ లెజెండ్ నాసిర్ హుస్సేన్తో ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. తమ కెప్టెన్ బాబర్పై ఒత్తిడి ఉంటుందని, కానీ అలాంటి ఆటగాళ్లకు ఒక్క షాట్ కనెక్ట్ అయితే ఆడే జోన్లోకి వెళ్లిపోతారని ధీమా వ్యక్తం చేశాడు.

ఎంసీజీలో కోహ్లీ మాస్టర్ క్లాస్
ఎంసీజీ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 159 పరుగులు చేసింది. అయితే పాక్ బౌలర్లు విజృంభించడంతో టీమిండియా 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో జూలు విదిల్చిన విరాట్ కోహ్లీ.. 82 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు ఒంటి చేత్తో విజయం అందించాడు. టీ20 క్రికెట్లో భారత ప్లేయర్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదే అంటూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుందీ ఇన్నింగ్స్.


Click it and Unblock the Notifications












