
ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో రెండు సిక్సులు కొట్టి పాక్ను నషీమ్ షా గెలిపించిన సంగతి తెలిసిందే. ఇక తాను సిక్సులు కొట్టగలగడానికి గల కారణాన్ని మ్యాచ్ అనంతరం నసీమ్ షా వెల్లడించాడు. ఆఫ్ఘనిస్తాన్ను పాక్ ఓడించడంతో ఆసియాకప్ ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో సెప్టెంబర్ 11న పాకిస్థాన్ ఫైనల్లో తలపడనుంది. ఇకపోతే ఆసియా కప్ టోర్నమెంట్లో ఇప్పటికే తన ఫాస్ట్ బౌలింగ్తో నషీమ్ షా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తత నడుమ సాగిన ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్లో అతను రెండు అద్భుతమైన సిక్సర్లు కొట్టడంతో హీరో అయిపోయాడు. అది కూడా 9వికెట్లు పడ్డాక.. ఫారుఖ్ బౌలింగ్లో కొట్టడం విశేషమేనని చెప్పాలి.
నషీమ్ షా మాట్లాడుతూ.. 'నేను బ్యాటింగ్కు దిగినప్పుడు సిక్స్లు కొట్టాగలననే నమ్మకం ఉంది. నేను తరచూ సిక్సులు కొట్టడం ప్రాక్టీస్ చేస్తాను. చివరి ఓవర్లో ఆఫ్ఘన్ బౌలర్లు యార్కర్లు వేస్తారని నాకు తెలుసు. నేను నా ప్రాక్టీస్ ప్రకారం ప్రయత్నించాను. దాన్ని సరిగ్గా అమలు చేశాను. ఏదైనా చేయాలంటే ముందుగా మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేను కొట్టగలననే నమ్మకం నాకు ఎంతో ఉపయోగపడింది. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ నేను నా బ్యాటింగ్ కూడా మార్చుకున్నాను. అది కూడా వర్కవుట్ అయింది. జట్టు తొమ్మిదో వికెట్ను కోల్పోయినప్పుడు.. గెలుస్తామని ఎవరూ ఊహించరు, కానీ నేను మాత్రం గెలుపు మాదే అనే హోప్ కలిగి ఉన్నాను. ఇది నాకు మరిచిపోలేని మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా నేను బౌలర్ని అని అందరూ మర్చిపోయారు.' అంటూ నసీమ్ పేర్కొన్నాడు.
పాకిస్థాన్కు 10బంతుల్లో 20పరుగులు కావాల్సి ఉండగా.. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. అప్పుడు నసీమ్ బరిలోకి దిగాడు. అంతకుముందు టీ20ల్లో నషీమ్ షా కేవలం ఒక్క బంతిని మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇక చివరి ఓవర్కు ముందు ఓవర్ ఐదో బంతికి అసిఫ్ అలీ ఔట్ కావడంతో పాక్ ఓటమి ఖాయమని అంతా ఫిక్సయ్యారు. పైగా ఆసిఫ్ అలీ, బౌలర్ ఫరీద్ ఖాన్ మధ్య గొడవ జరగడంతో ఆటగాళ్లు, ప్రేక్షకుల మధ్య ఉద్విగ్నత నెలకొంది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో పాకిస్తాన్కు 11పరుగులు అవసరం కాగా నషీమ్ షా ఒత్తిడిని అధిగమించి మ్యాచ్ను ముగించాడు. ఇక గెలుపు అనంతరం నషీమ్ షా గ్రౌండ్లో పరిగెత్తుతూ సంబరాలు చేసుకున్నాడు. పాక్ ప్లేయర్లందరూ గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని అభినందించారు.