ప్రస్తుతం దేశవ్యాప్తంగా పహల్గాం ఉగ్రదాడి గురించే చర్చంతా. ఈ భీకర దాడి వల్ల భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ - పాకిస్థాన్ క్రికెట్ కు సంబంధించిన అంశాలు కూడా తెగ చర్చకు వస్తున్నాయి. అంతటా ఈ రెండు దేశాల క్రికెట్ కు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాక్ జట్టుతో భవిష్యతులో కూడా ఎప్పటికీ ఆడకూడదని మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు చెందిన ఓ స్టార్ క్రికెటర్.. జాతీయ జట్టు నుంచి తప్పుకుని.. క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చారు.
పాకిస్థాన్ మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ నిదా డార్ (39 ఏళ్లు).. అనూహ్యంగా జాతీయ జట్టు నుంచి తప్పుకున్నారు. ఈమె గతంలో జాతీయ మహిళా జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరించారు. అయితే ఇప్పుడామె మానసిక సమస్యల వల్ల తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. తన పరిస్థితిని పీసీబీకి కూడా వివరించినట్లు చెప్పారు.

"గత కొద్ది నెలలుగా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా జరిగిన కొన్ని అంశాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా నా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. అందుకే క్రికెట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని నాపై నేను దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. ప్రతిఒక్కరూ ఈ సమయంలో నా ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను." అని నిదా పేర్కొన్నారు.
ఆల్ రౌండర్ నిదా దార్.. పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టులో స్టార్ క్రికెటర్ గా ఎదిగారు. కెరీర్ లో వన్డే, టీ20 ఫార్మాట్ లో ఆడిన ఆమె.. మొత్తంగా 270 మ్యాచులు ఆడారు. ప్రస్తుతం కొద్ది రోజులుగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో టీమ్ సెలక్షన్స్ కోసం జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఫిట్నెస్ టెస్టుకు కూడా హాజరయ్యారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా బ్రేక్ నిర్ణయం తీసుకుని అందరికీ షాకిచ్చారు. రీసెంట్గా నిదా.. ఉమెన్స్ నేషనల్ టీ20 కప్ లోనూ ఆడలేదు. చివరిసారిగా ఆమె గతేడాది అక్టోబరులో న్యూజిలాండ్ పై మ్యాచ్ ఆడింది.